'పేటీఎం బదులు ఇతర యూపీఐలను వాడండి'

by Dishanational1 |
పేటీఎం బదులు ఇతర యూపీఐలను వాడండి
X

దిశ, బిజినెస్ బ్యూరో: నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో వ్యాపారులు ఇతర యూపీఐలను వాడాలని ట్రేడర్స్ సంఘం సూచించింది. ఈ మేరకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) ప్రత్యామ్నాయ చట్టబద్ధమైన ఇతర చెల్లింపుల యాప్‌లను పరిశీలించాలని వ్యాపారులకు తెలిపింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈ సూచన అని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత పేటీఎంపై అందరికీ సందేహాలు నెలకొన్నాయి. భవిష్యత్తులో పేటీఎం పనిచేయడంపై అందరూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఆ ప్రకటనలో తెలిపారు. 'అంతరాలు లేని లావాదేవీలు, వాటి భద్రతను పరిగణలోకి తీసుకుని ఇతర యూపీఐ యాప్‌లను వాడటం మంచిదని పేర్కొంటున్నాం. డైరెక్ట్ లేదా బ్యాంకులు అందించే చెల్లింపుల యాప్‌లను ఉపయోగించడం మంచిదని' పేర్కొన్నారు. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వినియోగదారుల నుంచి ఎలాంటి డిపాజిట్లను స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు విధిచిన సంగతి తెలిసిందే. సరైన గుర్తింపు లేకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో సృష్టించబడిన వందలాది ఖాతాలు కంపెనీపై కఠినమైన ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణాలలో ఒకటని సమాచారం. 1,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు తమ ఖాతాలకు ఒకే పాన్ కార్డును లింక్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను తీసుకోవద్దని ఆర్‌బీఐ పేర్కొంది.

Next Story