ఓ వైపు పోలింగ్.. మరోవైపు ఎన్నికల సంఘానికి విజయ్ కీలక లేఖ

by Malleboina Mahesh |   (  Updated:2026-04-23 05:25:30  IST  )

తమిళనాడులో రవాణా ఆటంకాలు, రద్దీ దృష్ట్యా పోలింగ్ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని టీవీకే అధినేత విజయ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఓ వైపు పోలింగ్.. మరోవైపు ఎన్నికల సంఘానికి విజయ్ కీలక లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ (Polling process) పండగ వాతావరణంలో కొనసాగుతుంది. యువ, మహిళా ఓటర్ల తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. దీంతో ఉదయం 9 గంటలకు తమిళనాడులో 17.69 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ (Vijay) కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక విన్నపం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటల పాటు, అంటే రాత్రి 8:00 గంటల వరకు పొడిగించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి అధికారిక లేఖ రాశారు.

ప్రయాణాల్లో తలెత్తిన ఆటంకాలు (travel disruptions) కారణంగా చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో జాప్యం జరిగిందని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ ఎక్కువగా ఉండటం, క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన సమయం పెరుగుతుండటంతో, నిర్ణీత సమయానికి ఓటు వేయడం సాధ్యపడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభావితమైన నియోజకవర్గాల్లో పోలింగ్‌ను రాత్రి 8 గంటల వరకు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులోని 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఓటింగ్ శాతం పెంచేందుకు సమయం పొడిగించడం అవసరమని విజయ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉదయం నుంచి భారీగా పోలింగ్ నమోదవుతుండగా, విజయ్ చేసిన ఈ విన్నపంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూలు.. తొలి రెండు గంటల్లో రికార్డు స్థాయి పోలింగ్!

ప్రజలు సరైన నిర్ణయమే తీసుకుంటారు.. బీజేపీ నేత అన్నామలై కీలక వ్యాఖ్యలు

Next Story