‘సత్యమేవ జయతే’.. కుట్రలు బట్టబయలయ్యాయి: హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-22 06:37:07  IST  )

కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును మాజీ మంత్రి హరీశ్ రావు స్వాగతించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ‘X’ వేదికగా ట్వీట్ చేశారు.

‘సత్యమేవ జయతే’.. కుట్రలు బట్టబయలయ్యాయి: హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతిమంగా ధర్మమే జయించిందని ఆయన పేర్కొన్నారు. ‘సత్యమేవ జయతే.. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మమే జయిస్తుందని ఇవాళ మరోసారి నిరూపితమైంది’అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ కమిషన్ విచారణ జరిపిందని, దీనిని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టడం శుభపరిణామమని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి, రాజకీయ కక్షసాధింపు కోసమే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం డ్రామాలు ఆడిందని, ఈ తీర్పుతో ఆ కుట్రలు బట్టబయలయ్యాయని హరీశ్ విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ దుష్ప్రచారం మానేసి, వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ఎవరు అవునన్నా కాదన్నా... ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం’, ‘జై తెలంగాణ - జై కేసీఆర్’ అంటూ పోస్ట్ చేశారు.

కేసీఆర్‌, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట.. పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

పీసీ ఘోష్ రిపోర్టును చెత్తబుట్టలో వేయొచ్చు.. KCR తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు

Next Story