TG: జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ?.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

by Prasad Jukanti |   (  Updated:2026-02-15 09:21:11  IST  )

తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పేర్లు పరిశీలనలో ఉండగా, మంత్రి అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా పంపే వ్యూహంపై సీఎం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.

TG: జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ?.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? మంత్రి అజారుద్దీన్‍ను పదవి గండం నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేస్తున్నారా? పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యూహ రచన చేస్తున్నారని ఈ దెబ్బతో ఇటు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ, త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి మార్గం సుగమమం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ఆసక్తిగా మారింది.

రాజ్యసభకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి?:

తెలంగాణలో ఈ ఏడాది రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ వచ్చే ఏప్రిల్‍లో పదవి విరమణ చేయబోతున్నారు. అసెంబ్లీలో ఉన్న బలాబలాల మేరకు ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుందని ఈ క్రమలో ఈ స్థానాల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ రెండు స్థానాలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో హైకమాండ్ పరిశీలనలు చేస్తుండగా ఒకటి జాతీయ స్థాయి, మరొకటి తెలంగాణ మూలాలు కలిగిన వ్యక్తికి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఒక స్థానానికి గతేడాది ఇండియా కూటమి తరఫున రాష్ట్రపతి బరిలో ఉన్న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, మరోక స్థానానికి తిరిగి అభిషేక్ సింఘ్వీ పేర్లను పార్టీ పరిశీలిస్తుండగా ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం అధిష్టానం పెద్దలతో చర్చించారని పేర్కొంది. అయితే సుదర్శన్ రెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని ఈ కథనం స్పష్టం చేసింది. అలాగే సుదర్శన్ రెడ్డితో పాటు సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి పేరు సైతం రాజ్యసభ రేస్‍లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎమ్మెల్సీలపై సస్పెన్స్:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిథ్యం లేకుండానే అజారుద్దీన్ ను రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో అంటే వచ్చే ఏప్రిల్ 30 నాటికి ఎమ్మెల్సిగానో లేదా ఎమ్మెల్యేగానో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే మంత్రి పదవికి గండం ఏర్పడినట్లే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా శాసనసభకు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఇక ఎమ్మెల్సీగానే గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‍ల పదవుల విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అయితే ప్రొ.కోదండరామ్, అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నియమించాలని కేబినెట్ నిర్ణయించినా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‍లో ఉండటం వల్ల ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసును సుప్రీంకోర్టు వచ్చే మార్చి 19 వరకు వాయిదా వేసింది. ఆలోపు ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని గత విచారణలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

అజారుద్దీన్ విషయంలో కీలక నిర్ణయం:

ఎమ్మెల్సీలుగా నియమించుకోవచ్చని సుప్రీం తెలిపినా ఈ విషయంలో తుది తీర్పు ఎలా వస్తుందనే ఆందోళన మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‍లలో ఒకరి చేత కాంగ్రెస్ రాజీనామా చేయించి ఆయన స్థానంలో అజారుద్దీన్ కు మండలికి పంపించేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా రాజీనామా చేయబోయే వ్యక్తికి రాజ్యసభ ఆఫర్ చేసే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా వినిపిస్తోంది. అజారుద్దీన్ కు మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఆయనకు పదవి గండం తప్పించే అంశంలో సీఎం తీసుకోబోయే నిర్ణయం ఆసక్తిగా మారుతోంది.
Next Story