హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపడం తథ్యం : మంత్రి పొన్నం

by Batti.Sumithra |   (  Updated:2026-01-10 10:49:20  IST  )

ప్రజల మనోభావాలకు విరుద్ధంగా గత ప్రభుత్వం హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్ధిపేట జిల్లాలో కలిపిందని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.

హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపడం తథ్యం : మంత్రి పొన్నం
X

దిశ, హుస్నాబాద్ : ప్రజల మనోభావాలకు విరుద్ధంగా గత ప్రభుత్వం హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్ధిపేట జిల్లాలో కలిపిందని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం హుస్నాబాద్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాలోనే ఉండాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని గుర్తు చేశారు. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇక్కడి అంబేద్కర్ సర్కిల్‌లో ప్రజలకు ఇచ్చిన హామీని ఆయన ప్రస్తావించారు.

హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని నాడే ప్రకటించామని తెలిపారు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన లేదా సరిహద్దుల మార్పు ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టినప్పుడు హుస్నాబాద్ అంశానికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. భవిష్యత్తులో జిల్లాల మార్పులు, చేర్పులు జరిగే క్రమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

READ MORE .....

రైతు సంక్షేమమే ధ్యేయం.. మంత్రి పొన్నం

నువ్వు అంత బాధపడాల్సిన అక్కర్లేదు.. హరీశ్‌రావుకు మంత్రి పొన్నం కౌంటర్

Next Story