చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. బాధితుడి నుంచి భారీగా డబ్బు స్వాహా

by Prasad Jukanti |   (  Updated:2026-06-13 06:06:48  IST  )

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ డీప్‌ఫేక్ వీడియోలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ బాధితుడిని నమ్మించి అందినకాడికి దోచేశారు.

చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. బాధితుడి నుంచి భారీగా డబ్బు స్వాహా
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెరుగుతున్న టెక్నాలజీతోపాటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలకుండా కేటుగాళ్లు మోసానికి తెరలేపుతున్నారు. తమ వలలో పడేసుకోవడమే లక్ష్యంగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి ఓ వ్యక్తి నుంచి రూ. 80 వేలు కాజేశారు.

సమస్య పరిష్కారం ప్రయత్నంలో సైబర్ నేరగాళ్ల వలకు:

విశాఖ నగరంలోని సీతంపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి భూ సమస్య పరిష్కారం కోసం మంత్రి లోకేశ్‍ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు. ఆ మరుసటి రోజే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోను తన వాట్సాప్ డీపీగా పెట్టుకున్న వ్యక్తి శ్రీనివాసరెడ్డికి వాట్సాప్ కాల్ చేసి ఈ సమస్య సీఎంవోకు చేరిందని దీన్ని పరిష్కరిస్తామంటూ నమ్మబలికాడు. తాము నిజంగానే సీఎంవో కార్యాలయం నుంచే మాట్లాడుతున్నాం అని నమ్మించేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ తోనే మాట్లాడిస్తామంటూ వీడియో కాల్ చేశారు. ఈ క్రమంలో వీడియో కాల్ చేసి అవతలివైపు సీఎం కూర్చుని మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని చెప్పినట్లు వీడియో క్రియేట్ చేశారు. ఆ తర్వాత మరోసారి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు సమస్య చాలా పెద్దదని డబ్బులు అవసరం అవుతాని నమ్మించి బాధితుడి నుంచి దశలవారీగా రూ.80 వేలు కాజేశారు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.

ప్రాణాలను పణంగా పెట్టి ‘వర్క్ ఫ్రమ్ బైక్’ వద్దు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ బరితెగింపు.. రాంగ్ రూట్‌లో వచ్చి హల్ చల్

Next Story