- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కేసు ఒక కొలిక్కి రాబోతోంది: CM రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీ ఉనికి, కాళేశ్వరం విచారణ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ఉనికి, కాళేశ్వరం విచారణ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక "సచ్చిన శవం"తో సమానమని సీఎం వ్యాఖ్యానించారు. ఏ ఉద్దేశంతో అయితే ఆ పార్టీ ఏర్పడిందో ఆ అవసరం తీరిపోయిందని, దానికి గతం తప్ప భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. పదేళ్ల అధికార గర్వంతో ప్రజలను ఇబ్బంది పెట్టిన కల్వకుంట్ల కుటుంబానికి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయని అన్నారు. "తెలంగాణలో ఇకపై ఉండబోయేది కాంగ్రెస్ కూటమి వర్సెస్ బీజేపీ-బీఆర్ఎస్ కూటమి మాత్రమే" అని రాజకీయ ముఖచిత్రాన్ని వివరించారు.
కేసీఆర్ పట్ల వ్యక్తిగత ద్వేషం లేదు..
కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి మాత్రమే తప్ప శత్రువు కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని, ఆయనకు ఏమైనా జరిగితే తనకేమీ రాదని, వాళ్లకే లాభమని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాల కోసం కేటీఆర్ను సీఎం చేయాలని బీఆర్ఎస్ ఆఫీసులోనే చర్చలు జరిగాయని, కేసీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రాజకీయ నాయకుడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకోవద్దని సీఎం సూచించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ కోరారని, కానీ కోర్టు నివేదిక యధాతథంగా కొనసాగుతుందని చెప్పిందని గుర్తు చేశారు. కేవలం నిబంధనల ప్రకారమే నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పిందని, ఇది వారికి వచ్చిన పెద్ద ఊరట ఏమీ కాదని అన్నారు. NDSA, విజిలెన్స్, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ను కలుస్తాం. ఒకవేళ స్పందన లేకుంటే మా తదుపరి కార్యాచరణ సిద్ధంగా ఉంది" అని హెచ్చరించారు.
హైడ్రా, ఫోన్ ట్యాపింగ్..
ఐలాపూర్లో బీఆర్ఎస్ నాయకుడి అక్రమ కట్టడాలను కూల్చివేసినప్పుడే మా చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కేసు విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని, త్వరలోనే అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని వెల్లడించారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్తో ఉన్న అంతర్గత ఒప్పందం వల్లే కాళేశ్వరంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, బండి సంజయ్ వంటి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం హైకోర్టు పర్యవేక్షణలో ఉందని, ఇందులో బాధ్యులైన వారందరి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నామని, త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, ఫార్ములా ఈ రేస్ నిబంధనల ఉల్లంఘన కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేశామని గుర్తు చేసిన ఆయన, రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. గత పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీగా కలిసే పోటీ చేశాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కూటమి ఒకవైపు, బీఆర్ఎస్-బీజేపీ కూటమి మరోవైపు ఉండి తలపడబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు.






