ఇరాన్ భీకర దాడులు.. భారీగా యుద్ధ విమానాలు సహా ఇద్దరు అమెరికా సైనికులు మృతి

by Muthe.Rajitha |

జోర్డాన్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన భీకర క్షిపణి దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు.

ఇరాన్ భీకర దాడులు.. భారీగా యుద్ధ విమానాలు సహా ఇద్దరు అమెరికా సైనికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్, అమెరికా దేశాల మధ్య సైనిక దాడులు పరాకాష్టకు చేరాయి. జోర్డాన్ లోని అల్ అజ్రాఖ్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం జరిపిన భీకర క్షిపణి దాడుల్లో (Missile Strikes) ఇద్దరు అమెరికా సైనికులు (U.S. Troops) మరణించారు. ఈ దాడిలో మరికొంత మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ నివేదికలు ధృవీకరించాయి.

ప్రతీకారంతో విరుచుకుపడ్డ ఇరాన్

ఇటీవల ఇరాన్ పరిధిలోని కీలక విద్యుత్ గ్రిడ్‌లు, మౌలిక సదుపాయాలపై అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ సైన్యం ఈ భారీ ఎదురుదాడికి దిగింది. జోర్డాన్ లోని అమెరికా సైనిక స్థావరంపై ఒక్కసారిగా పదుల సంఖ్యలో శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో అక్కడ భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఈ క్షిపణి దాడుల తీవ్రతకు అమెరికా సైనిక స్థావరంలోని రన్‌వేలపై సిద్ధంగా ఉన్న కొన్ని అత్యాధునిక యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సైనికుల ప్రాణ నష్టంతో పాటు, బిలియన్ల డాలర్ల విలువైన సైనిక సంపద, యుద్ధ విమానాలు రన్‌వేలపైనే బూడిదవడం అమెరికా రక్షణ శాఖను (Pentagon) తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

హెచ్చరించిన వైట్ హౌస్

తమ సైనికుల మరణాన్ని అమెరికా ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ దారుణానికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైట్ హౌస్ వర్గాలు హెచ్చరించాయి. తమ సైనికుల ప్రాణ త్యాగానికి బదులుగా ఇరాన్ లోని ప్రధాన వ్యూహాత్మక కేంద్రాలపై అంతకంతకూ బలమైన ఎదురుదాడులు (Counter-strikes) ఉంటాయని అమెరికా సైనిక కమాండ్ స్పష్టం చేసింది. ఈ ఘటనతో అరబ్ దేశాలు మరియు పశ్చిమాసియా రీజియన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Next Story