Eng vs Ind : నేడే మూడో వన్డే.. టీమిండియా వన్డే సిరీస్‌నైనా గెలుస్తుందా?

by Harish |

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం మూడో వన్డే జరగనుంది.

Eng vs Ind : నేడే మూడో వన్డే.. టీమిండియా వన్డే సిరీస్‌నైనా గెలుస్తుందా?
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. ఇంగ్లాండ్‌పై కూడా టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యింది. ఇప్పుడు భారత జట్టు ముందు మరో సిరీస్ గండం ఉంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఫలితం తేలేది నేడే. లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో మూడో వన్డే జరగనుంది. సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించాయి. 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఆదివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ సొంతమవుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నది.

టీమిండియా బ్యాటింగ్‌లో సమిష్టి ప్రదర్శన లోపించినట్టు కనిపిస్తుంది. గత రెండు మ్యాచ్‌లను పరిశీలిస్తే ఒకరిద్దరు మీదనే జట్టు ఆధారపడింది. తొలి మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా మిగతా టాప్ బ్యాటర్లు నిరాశపరిచారు. సుందర్, అక్షర్ హాఫ్ సెంచరీలు చేయకపోతే తొలి వన్డేలో భారత్ పరిస్థితి మరోలా ఉండేది. ఇక రెండో వన్డేలో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మాత్రమే రాణించగా.. మిగతా వారు తేలిపోయారు. రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్లు జట్టులో ఉన్నా బ్యాటింగ్‌లో జట్టు మెరుగైన ప్రదర్శన చేయడంలో తడబడుతోంది. ఇంగ్లాండ్ పిచ్‌లను అర్థం చేసుకోకపోవడం కారణంగానే భారత బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. లార్డ్స్ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే మరో సిరీస్ ఓటమి ఖాయం. మరోవైపు, బ్యాటింగ్‌తో పోలిస్తే భారత బౌలింగ్ దళం మెరుగ్గా కనిపిస్తుంది. బౌలర్లు తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను 258 పరుగుల మోస్తరు స్కోరుకే ఆలౌట్ చేశారు. రెండో వన్డేలో కూడా ఆరంభంలో అదరగొట్టారు. కీలక వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ ఒక దశలో 125/5 ఓటమి పాలయ్యేలా కనిపించింది. కానీ, జో రూట్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. గుర్నూర్ బ్రార్ నిలకడగా రాణిస్తున్నాడు రెండు మ్యాచ్‌ల్లోనూ రెండేసి వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 3 వికెట్లు తీశాడు. గుర్నూర్, ప్రసిద్ధ్ ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు తీస్తున్నారు. అక్షర్ పటేల్ తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. రెండో వన్డేలో ఒక్క వికెట్ తీశాడు. అయితే, స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నుంచి తన స్థాయి ప్రదర్శన చేయడం లేదు. అతను రెండు వికెట్లే తీశాడు. పరుగులు కట్టడి చేస్తున్నా వికెట్లు తీయడం లేదు. మూడో వన్డేలో అతను విజృంభించాలని జట్టు ఆశిస్తుంది.

రోహిత్‌పైనే అందరి దృష్టి

లార్డ్స్ స్టేడియంలో రోహిత్ శర్మ చివరి మ్యాచ్ ఆడబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను బీసీసీఐ కొట్టిపారేసింది. లార్డ్స్ మ్యాచ్ అతనికి చివరిది కాదని, అతను వన్డే జట్టులో కొనసాగుతాడని వెల్లడించింది. టెస్టు, టీ20 రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత మరో వన్డే సిరీస్ సెప్టెంబర్‌ ఆఖర్లో జరగనుంది. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రోహిత్‌కు ఇది ఆఖరి మ్యాచ్ కాదని బీసీసీఐ స్పష్టం చేసినప్పటికీ వన్డే వరల్డ్ కప్-2027 ప్రణాళికల్లో ఉంటాడని స్పష్టం చేయలేదు. రోహిత్‌ను పక్కనపెట్టి యశస్వి జైశ్వాల్‌కు చాన్స్‌లు ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మూడో వన్డే హిట్‌మ్యాన్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో అతను రాణించడంపైనే జట్టులో చోటు ఉంటుందా?పోతుందా? అన్నది ఆధారపడి ఉండే అవకాశాలు లేకపోలేదు. దీంతో లార్డ్స్‌లో అతను ఎలా ఆడతాడోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

చివరి 10 సిరీస్‌ల్లో 8 భారత్‌వే

చాలా కాలంగా వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆఖరి 10 వన్డేల్లో భారతే 8 సిరీస్ విజయాలు సాధించడం విశేషం. ఇంగ్లాండ్ చివరగా 2018‌లో వన్డే సిరీస్ గెలిచింది. ఈ సారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది.

తుది జట్లు(అంచనా)

భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్/హర్ష్ దూబె, జస్ప్రిత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్ : బెన్ డక్కెట్, జాకబ్ బెథెల్, జోరూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్, సామ్ కర్రన్, విల్ జాక్స్, అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్/జోష్ టంగ్, సాకిబ్ మహమూద్/జోష్ టంగ్, ఆదిల్ రషీద్

Next Story