డబ్ల్యూటీసీ‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తప్పు చేసిన టీమిండియా..!

by  |
డబ్ల్యూటీసీ‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తప్పు చేసిన టీమిండియా..!
X

దిశ, స్పోర్ట్స్: రెండేళ్ల పాటు విదేశీ పర్యటనలు, స్వదేశీ సిరీస్‌లు ఆడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సగర్వంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంది టీమ్ ఇండియా. 2019-21 డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఆరు సిరీస్‌లు ఆడి ఐదింట విజయాలు సాధించింది. టీమ్ ఇండియా ఈ మొత్తం ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోయింది న్యూజీలాండ్ మీదే కావడం గమనార్హం. 2020 మొదట్లో న్యూజీలాండ్ పర్యటనలో వైట్ వాష్ చేయించుకున్న టీమ్ ఇండియా.. చివరి మెట్టుపై అదే కివీస్‌పై ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అసలు టీమ్ ఇండియా ఎక్కడ తప్పు చేసిందని విశ్లేషణలు చేస్తున్నారు. క్రికెట్ నిపుణలు కూడా భారత జట్టు వ్యూహాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత జట్టుకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఇంగ్లాండ్ సిరీస్ ఏప్రిల్‌లో పూర్తయిన తర్వాత భారత జట్టు ఐపీఎల్ ఆడింది. కానీ టీ20 ఫార్మాట్‌కు సుదీర్ఘమైన టెస్టు ఫార్మాట్‌కు చాలా తేడా ఉంటుంది. ఒకవైపు న్యూజీలాండ్ జట్టు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడి పూర్తి సన్నద్దతతో ఉంటే.. టీమ్ ఇండియా మాత్రం మ్యాచ్ ముందు మూడు రోజుల పాటు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఇంగ్లాండ్ పరస్థితులకు టీమ్ ఇండియా పూర్తిగా అలవాటు కాలేదనే విషయం మ్యాచ్‌లో పూర్తిగా అర్థం అయ్యింది.

బౌలింగ్ బలహీనత..

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సరిగ్గా రెండు రోజుల ముందే టీమ్ ఇండియా యాజమాన్యం తుది జట్టును ప్రకటించింది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేసింది. అప్పటి సౌతాంప్టన్ వాతావరణం పూర్తిగా పొడిగా ఉండటంతో పిచ్ నాలుగు, ఐదు రోజుల్లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసి అశ్విన్, జడేజాలను తీసుకున్నారు. కానీ తొలి రోజు టాస్ పడకుండానే రోజు మొత్తం తుడిచి పెట్టుకొని పోయింది. వాతావరణం పూర్తిగా మారిపోవడంతో స్పిన్నర్‌ను తప్పించి మరో పేసర్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సలహా ఇచ్చారు. భారత జట్టు బౌలింగ్ లైనప్ మార్చాలని గవాస్కర్ కూడా సూచించాడు. కానీ టీమ్ ఇండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఇక్కడే భారత జట్టు అతిపెద్ద తప్పు చేసింది. బౌన్సీ వికెట్‌పై ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలిగే మరో పేసర్‌ను మిస్ చేసింది. మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ తప్ప ఇంకెవరూ సరిగా బౌలింగ్ చేయలేదు. బుమ్రా అంచనాలను పూర్తిగా తప్పాడు. ఇద్దరు స్పిన్నర్లు నామమాత్రంగానే మిగిలిపోయారు. జడేజాను తప్పించి శార్దుల్ ఠాకూర్‌ను తీసుకొని ఉంటే బ్యాటింగ్ కూడా చేసే వాడని సీనియర్లు అంటున్నారు. కనీసం బౌలర్‌ను కాకపోయినా.. విహారి వంటి బ్యాట్స్‌మాన్ అందుబాటులో ఉంటే కనీసం పరుగులైనా వచ్చేవని అభిప్రాయపడుతున్నారు.

కెప్టెన్సీ లోపం..

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో స్పష్టమైన తేడా కనపడింది. బౌలర్లను ఉపయోగించడంలో కేన్ తన అనుభవాన్నంతా ఉపయోగించాడు. అంతే కాకుండా ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లు సరిగ్గా చేసి కీలక వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు. కేన్ వ్యూహాలకు అనుగుణంగా కివీస్ బౌలర్లు కూడా మంచి స్వింగ్ బాల్స్‌తో చెలరేగిపోయారు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ బంతులతో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌ను కన్ఫ్యూజన్ చేశారు. అదే సమయంలో టీమ్ ఇండియా బౌలర్లు సరైన ప్రదేశంలో బంతులు వేయడానికి కూడా కష్టపడ్డారు. బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శించడంలో విఫలమయ్యారు. ఇక టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో కుదురుకొని పరుగులు రాబట్టలేకపోయారు. కివీస్ బౌలర్లను అంచనా వేయడంలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కోహ్లీ, రహానే, పుజారాలు తమ వికెట్లను మామూలు బంతులకే పారేసుకోవడం భారంగా మారింది. మరోవైపు ఓపెనింగ్ జోడీ కూడా సరైన పునాది వేయలేకపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత జట్టు వ్యూహాలు, ఎగ్జిక్యూషన్‌లో చాలా లోపాలు కనపడుతున్నాయి. ఇక ముందైనా వీటిని సరిదిద్దుకుంటే ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టుసిరీస్‌లో రాణించే అవకాశం ఉంటుంది.

Next Story

Most Viewed