అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రుల్లో టెన్షన్.. బాబుకు సవాళ్లు

by Disha Web Desk 4 |
అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రుల్లో టెన్షన్..  బాబుకు సవాళ్లు
X

పదవి కావాలంటే పనితీరు మార్చుకోవాల్సిందే.. లేకపోతే ఉద్వాసన తప్పదన్న సీఎం జగన్​ హెచ్చరికల నేపథ్యంలో మంత్రుల్లో టెన్షన్​ మొదలైంది. పైగా నేటి నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలు వారికి అగ్ని పరీక్షలా మారాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పేరిట నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. కానీ, సీఎం సమక్షంలో అధికార పక్షం ఏమాత్రం వెనక్కు తగ్గినా పదవులు పోవడం ఖాయమన్న భావనలో మంత్రులు ఉన్నారు. అందుకే ప్రతిపక్షాన్ని కట్టడి చేయడంతోపాటు ఎదురుదాడికి సిద్ధమన్న సంకేతాలను ఇప్పటికే పలువురు మంత్రులు ఇస్తున్నారు. పోలవరంపై చర్చకు రావాలంటూ అంబటి.. రాజధానిపై చర్చిద్దామంటూ చంద్రబాబుకు మేరుగు సవాళ్లు విసురుతున్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య సభా సమరానికి గురువారం అసెంబ్లీ వేదికగా మారబోతున్నది.

దిశ, ఏపీ బ్యూరో: నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఐదు రోజుల పాటు జరుగుతాయని భావిస్తున్న ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మరోవైపు అమరావతి నుంచి రైతులు అరసవెల్లి వరకూ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఇటీవల కేబినెట్ భేటీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలేనని విశ్లేషకులు అంటున్నారు.

ఒత్తిడిలో మంత్రులు

ఈ అసెంబ్లీ సమావేశాలు వైసీపీ మంత్రులకు కీలకంగా మారాయి. మంత్రుల వ్యవహారశైలిని సీఎం జగన్ నిశితంగా పరిశీలించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టబోతున్న ప్రభుత్వం అంతకుమించి అమరావతి పాదయాత్రను సైతం కౌంటర్ చేయబోతున్నది. ఇందులో మంత్రులదే కీలకపాత్ర కాబోతున్నది. వారు దీటుగా ఎదుర్కోవడంపైనే వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో గట్టెక్కుతుందా ? ఇరుక్కుంటుందా? అనేది ఆధారపడి ఉన్నది.

మంత్రులపై సీఎం అసహనం

ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. విపక్షాల్ని కౌంటర్ చేయడంలో మంత్రులు దారుణంగా విఫలమవుతున్నారంటూ నిలదీశారని చెబుతున్నారు. అంతే కాదు మీరు మారతారా? లేక మార్చేయమంటారా? అంటూ మరోసారి కేబినెట్ విస్తరణకు కూడా సంకేతాలు ఇచ్చేశారని సమాచారం. దీంతో మంత్రులు ఇప్పుడు గతంలో కంటే బెటర్ గానే విపక్షాల్ని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇదంతా ఓ ఎత్తయితే అసెంబ్లీలో రికార్డెడ్​గా సాగే ప్రసంగాలు మరో ఎత్తు. దీంతో మంత్రులు అమరావతి, చంద్రబాబు, టీడీపీ, జనసేన, బీజేపీని కలిపి విమర్శలు చేసేందుకు అసెంబ్లీలో అవకాశం దక్కబోతున్నది. ఇందులో వారు సక్సెస్ అయితే సరేసరి. లేకపోతే జగన్ దృష్టిలో మంత్రులు మరింత పలుచన కావడం ఖాయం. దానితో ఎలాగైనా విపక్షాన్ని టార్గెట్ చేసేందుకు అధికారపార్టీ సభ్యులు రెడీ అవుతున్నారు.

చంద్రబాబూ.. సభకు రండి: వైసీపీ మంత్రుల జపం

చంద్రబాబు అసెంబ్లీకి వస్తే గట్టిగా విమర్శలు చేద్దామనుకుంటున్నారో ఏమో గానీ.. చంద్రబాబును సభకు రమ్మంటూ మంత్రులు సవాళ్లు విసురుతున్నారు. ఈ సమావేశాలకు వైసీపీ అన్ని అస్త్రాలతో సిద్ధమైంది. అయితే విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అధినేత లేకుండానే హాజరుకాబోతున్నారు. దీంతో చంద్రబాబు లేని లోటు కనిపిస్తున్నది. సమావేశాలకు రాకుండా చంద్రబాబు బాయ్ కాట్ చేయడాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తప్పుబట్టారు. సీఎం జగన్ కు మొహం చూపించలేకే చంద్రబాబు అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. చర్చ పేరుతో బయటి నుంచి సవాళ్లు విసరడం కాదని, సభకు రావాలని డిమాండ్​ చేశారు. చంద్రబాబు కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి కోరారు. ఈ మూడేళ్లలో ప్రజలకు తాము ఏమేం చేశామో చెబుతామని, కానీ మీకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి విపక్షనేత ఉండడం మరో దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. పోలవరంపై చర్చిద్దాం కనీసం ఒక రోజు లేదా..గంటైనా అసెంబ్లీ కి రావాలని చంద్రబాబు ను కోరారు. ఇక సీఎం జగన్ మాత్రం తన బ్రెయిన్ చైల్డ్ మూడు రాజధానులపై ఈ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ సారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Also Read : జగన్ ఫోకస్ ఈ అంశంపైనే.. అందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్

Also Read : అమరావతి రైతుల పాదయాత్ర... వెల్లువెత్తుతున్న విరాళాలు

Also Read : ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. చొచ్చుకెళ్లిన టీడీపీ శ్రేణులు


Next Story