BJP: ఉత్తరాంధ్రలో సరే.. మరి రాయలసీమలో అలా ఎందుకు జరిగింది?

by Disha Web Desk 16 |
BJP: ఉత్తరాంధ్రలో సరే.. మరి రాయలసీమలో అలా ఎందుకు జరిగింది?
X

దిశ, డైనమిక్: ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలన్న బీజేపీ పెద్దల ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయి. రోజు రోజుకు బీజేపీ బలపడాల్సింది పోయి బలహీనపడుతుంది. అంతేకాదు పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడటం మైనస్ అయితే మిగిలిన వారు వర్గపోరుతో పార్టీకి చేటు తెస్తున్నారు. అంతేకాదు బీజేపీని ఒక తాటిపైకి తీసుకువచ్చే నాయకత్వం లోపించింది అని ఆ పార్టీ నేతలే బాహటంగా చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనేనని చెప్పుకుంటున్న బీజేపీ దాన్ని ప్రజల్లోకి చేరవేయడంలో విఫలమవుతుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను పట్టించుకోకపోవడం అనేది ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. దీంతో ప్రజలు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ప్రజల్లో ఉన్న ఆ వ్యతిరేకతను తొలగించేందుకు కనీసం బీజేపీ నేతలు ప్రయత్నించడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. కనీసం స్టార్ కాంపైనర్ కూడా లేరని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. దీని ఫలితంగా ఎన్నికలు ఏవైనా బీజేపీకి ఫలితాలు రివర్స్ అవుతున్నాయి.

ఫలితాలన్నీ రివర్స్

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలైంది. అనంతరం జరిగిన స్థానిక సంస్థలు, పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ చావుతప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే ఎన్నిక ఏదైనా బీజేపీ ముంగిట ఓటమి స్వాగతం పలకాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగింది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు ప్రయత్నించారు. కేంద్రం పెద్దలు వచ్చినా కానీ అంత ఫేమ్ ఉన్న నేతలు కాకపోవడంతో పట్టభద్రులను ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లకే పరిమితమయ్యారు. అంటే దాదాపు డిపాజిట్ కోల్పోయారన్నమాట. ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి దారుణమైన ఓటమి చవిచూశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీఎన్ మాధవ్ గెలుపొందారు. అయితే ఈసారి డిపాజిట్ సైతం కోల్పోవడంతో బీజేపీ పరిస్థితి దయనీయంగా మారింది.

ఉత్తరాంధ్రలో సరే మరి రాయలసీమలో..

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌కి డిపాజిట్ కూడా దక్కకపోవడం వెనుక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తీవ్ర ప్రభావం చూపిందని తెలుస్తోంది. కనీసం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఓట్లుకూడా కలిసిరాలేదు. అంతేకాదు విశాఖ రైల్వే జోన్, విభజన హామీలు అమలు చేయకపోవడంపై పట్టభద్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రైల్వే జోన్‌ విషయంలో దాగుడుమూతలు ఆడటం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోవడం ఇలా అనేక అంశాలు యువతను ఆలోచింపజేశాయని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వేజోన్ అంశం బీజేపీని దెబ్బతీస్తే ఇక రాయలసీమ ప్రాంతాల్లో విభజన హామీలు అమలు చేయకపోవడం ఓట్లను దూరం చేసుకుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Mlc Elections: తిరుపతిలో అంబరాన్నంటిన టీడీపీ సంబరాలు

BJP Major Defeat: ఉత్తరాంధ్రలో ఘోర పరాభవం.. ఆ రెండే కారణమా..?



Next Story