నాలుగేళ్ల చిన్నారిపై దారుణం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం

by Ramesh Naini |

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, కిరాతకంగా హతమార్చిన ఘటనలో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

నాలుగేళ్ల చిన్నారిపై దారుణం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, కిరాతకంగా హతమార్చిన ఘటనలో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు యత్నించి, కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. జాతీయ మీడియా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ జిల్లా వసాద్ రైల్వే స్టేషన్‌లో చెత్త ఏరుకుంటూ జీవిస్తున్న ఓ నిరుపేద (వలస) కుటుంబానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిని సురేశ్ పార్మర్ అనే వ్యక్తి రాత్రి నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్ చేశాడు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం, రైలు వస్తున్న సమయంలో ట్రాక్‌పై పడేసి కిరాతకంగా హత్య చేశాడు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా అత్యాచారం జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్‌కౌంటర్ జరిగిందిలా..

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడు సురేశ్ పార్మర్‌ను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఆనంద్ క్రైమ్ బ్రాంచ్ (LCB) పోలీసులకు అప్పగించారు. అయితే, నిందితుడిని పోలీసు వ్యాన్‌లో తరలిస్తుండగా తనకు వాంతులు వస్తున్నాయంటూ అధికారులను నమ్మించి వాహనం నుంచి కిందకు దిగాడు. కిందకు దిగిన వెంటనే తన వద్ద దాచి ఉంచుకున్న కత్తితో అకస్మాత్తుగా పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించాడు. ఈ దాడిలో రాజ్‌వీర్‌, మహిపాల్‌ అనే ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కత్తి కిందపడేయాలని పీఎస్ఐ రానా పదేపదే హెచ్చరించినప్పటికీ నిందితుడు వినకపోవడంతో, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు.

తుపాకీ గాయాలైన సురేశ్ పార్మర్‌ను ఆసుపత్రికి తరలించగా, అత్యవసర చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడిన పోలీసులకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కాగా, వసాద్ రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్ చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోను పోలీసులు విడుదల చేశారు.

Next Story