Mlc Elections: తిరుపతిలో అంబరాన్నంటిన టీడీపీ సంబరాలు

by Disha Web Desk 16 |
Mlc Elections: తిరుపతిలో అంబరాన్నంటిన టీడీపీ సంబరాలు
X

దిశ, తిరుపతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ మెజార్టీ సాధించడంతో అవినీతి వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టే రోజులు దగ్గరపడ్డాయని తిరుపతి మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెజార్టీ సాధించడంతో శుక్రవారం టౌన్ క్లబ్ సర్కిల్‌లో ఊకా విజయ్ కుమార్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు జేబీ శ్రీనివాస్ తదితరులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ టౌన్ బ్యాంకు, కార్పొరేషన్ ఎన్నికల్లో అవినీతి అరాచక ఆగడాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే చెంపపెట్టు అని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి సమర్ధుల పాలనను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి అరాచకాలపై పునాదులు వేసుకున్న అధికార వైసీపీకి ఈ రాష్ట్రంలో ఇక నూకలు చెల్లాయని చెప్పారు. పట్టభద్రులు కాని వారిని, కనీస విద్యార్హత లేని వారిని ఓటర్లుగా చేర్చి దొంగ ఓట్లు వేసుకున్న వైసీపీకి అసలు సిసలైన పట్టభద్రులు గెలుపు అనే ఓట్లతో సమాధానం చెప్పారని విజయకుమార్ తెలిపారు.

ఈ ఎన్నికల ఫలితాలే ఈ అవినీతి అరాచక దుష్ట పరిపాలనకు సమాధానమని విజయకుమార్ చెప్పారు. తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో టౌన్ బ్యాంక్, కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గద్దెనెక్కారని, ఇక అటువంటి దొంగాటలు సాగనివ్వమని , విజ్ఞులైన ప్రజలు ఇక అన్ని ఎన్నికలలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తారని వూకా విజయ్ కుమార్ తెలిపారు.

టీడీపీ సీనియర్ నేత జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీసులు కూడా ఇకనైనా మారాలని, చట్టం ప్రకారం నడుచుకుంటే మంచిదని దోషులెవరో, నిర్దోషులెవరో గుర్తించి అందుకు అనుగుణంగా అడుగులేస్తే మంచిదని హితవు పలికారు. ప్రతి నిత్యం అన్యాయ అక్రమాలు చేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడే అధికార పార్టీ నేతల ఆగడాలు ఇక చెల్లవని శ్రీనివాస్ చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Mlc Elections: అనంతపురం జేఎన్‌టీయూ కౌంటింగ్ సెంటర్‌లో ఉద్రిక్తత



Next Story

Most Viewed