భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. బాబా వంగా భవిష్యవాణి నిజమవుతుందా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-03 03:31:28  IST  )

మెక్సికోలో తాజాగా సంభవించిన భూకంపం కారణంగా ఇద్దరు చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. బాబా వంగా భవిష్యవాణి నిజమవుతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెక్సికోలో శుక్రవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయింది. గెర్రెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ సమీపంలో వచ్చిన ఈ భూకంపకేంద్రాన్ని భూమిలోపల 35 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. సుమారు 33 సెకన్ల పాటు భూమి కంపించగా మెక్సికో సిటీ, అకాపుల్కో నగరాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. భూప్రకంపనలు రాగానే హెచ్చరిక సైరన్లు మోగడంతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

వైరల్ అవుతున్న వీడియోలు

మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీమ్ బామ్ 2026లో తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో భూకంపం సంభవించింది. సైరన్ల మోత వినిపించగానే.. ఎవరూ కంగారు పడొద్దని, శాంతంగా ఉండాలని ఆమె సూచించారు. కాసేపటికి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను, అక్కడున్నవారిని బయటికి తీసుకెళ్లారు. ప్రకంపనలు ఆగిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కంటిన్యూ చేశారు. నూతన సంవత్సరంలో రెండోరోజే సంభవించిన ఈ భూకంపంలో ఇద్దరు మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అక్కడి మీడియా తాజాగా వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో హైవేలపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నిప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంపంకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాబావంగా భవిష్యవాణి నిజమవుతోందా?

మెక్సికోలో సంభవించిన భూకంపంతో.. 2026పై బాబా వంగా చెప్పిన భవిష్యవాణిపై చర్చ మొదలైంది. ఈ ఏడాదిలో భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు బాబావంగా భవిష్యవాణి చెబుతోంది. అలాగే కొన్నితీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు రావొచ్చని ఆమె హెచ్చరించినట్లు ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. నూతన సంవత్సరం ఆరంభంలోనే భూకంపం రావడంతో బాబావంగా భవిష్యవాణి ప్రాధాన్యత సంతరించుకుంది. 2026లో ఎన్ని ప్రకృతి విపత్తులు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన మొదలైంది.

Next Story