పావురం ఎగురవేసిన విజయ్.. పెటా సీరియస్

by Muthe.Rajitha |   (  Updated:2026-04-25 09:14:18  IST  )

TVK అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తలపతి విజయ్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు.

పావురం ఎగురవేసిన విజయ్.. పెటా సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తలపతి విజయ్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పావురం ఎగురవేసిన ఘటనపై జంతు సంక్షేమ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, విజయ్ తన పార్టీ జెండా రంగులను వేసిన పావురాలను గాలిలోకి ఎగురవేశారు. శాంతికి చిహ్నంగా భావించే పావురాలకు ఇలా కృత్రిమ రంగులు పూయడం, వాటిని రాజకీయ ప్రచారానికి వాడుకోవడంపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో, అంతర్జాతీయ జంతు సంక్షేమ సంస్థ PETA (People for the Ethical Treatment of Animals) ఇండియా రంగంలోకి దిగి విజయ్‌కు ఘాటుగా లేఖ రాసింది.

పెటా ఘాటు లేఖ

విజయ్‌కు రాసిన అధికారిక లేఖలో పెటా పలు కీలక అంశాలను లేవనెత్తింది. పక్షుల రెక్కలకు, శరీరానికి రసాయనాలతో కూడిన రంగులు పూయడం వల్ల అవి అనారోగ్యానికి గురవుతాయని, ఇది 'జంతు క్రూరత్వ నిరోధక చట్టం' (Prevention of Cruelty to Animals Act) కింద నేరమని స్పష్టం చేసింది. మూగజీవాలను రాజకీయ ప్రయోజనాల కోసం, వినోదం కోసం ఉపయోగించడం అనైతికమని, ఇది వాటికి తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని పెటా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పార్టీ ఆధీనంలో ఉన్న మిగిలిన పావురాలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడబోమని హామీ ఇవ్వాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. కాగా ఈ వివాదంపై విజయ్ నుంచి, టీవీకే పార్టీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, పార్టీలోని కొందరు కీలక నేతలు మాత్రం ఇది కేవలం సాంప్రదాయబద్ధంగా చేసిన పని అని, పావురాలకు హాని కలిగించే ఉద్దేశం తమకు లేదని చెబుతున్నట్టు సమాచారం.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కుమార్తెపై వేధింపులు.. నిందితుడు అరెస్ట్

Next Story