Minister Harish Rao: బస్తీ దవాఖాన దోస్తీ దవాఖానగా మారింది: హరీశ్‌రావు

by Dishanational1 |
Minister Harish Rao Says, Basthi Dawakhana now becomes a Dosti Dawakhana
X

దిశ, సంగారెడ్డి: Minister Harish Rao Says, Basthi Dawakhana now becomes a Dosti Dawakhana| సంగారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేయగా సంగారెడ్డికి రూ.50 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డికి విడుదల చేసిన రూ. 50 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ పైలాన్ ను ఆవిష్కరించారు. అంతకుముందు 2.90 కోట్లతో బీసీ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ. 1.38 కోట్లతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, రూ. 15 కోట్లతో నీళ్ల ట్యాంకును, రూ. 15 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు. పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డిలో రోడ్లు సరిగా లేవు అని చింతా ప్రభాకర్ సీఎం కేసీఆర్ ను నిధులు ఇవ్వాలని అడిగారని అందుకే ముఖ్యమంత్రి సంగారెడ్డికి రూ.50 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్నారు. ఆ నిధులతో యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేయాలని సూచించారు. ఆగస్టు నెలలో పనులు పరిశీలించేందుకు తాను అన్ని బస్తీలలో తిరిగి పనులను పర్యవేక్షిస్తానన్నారు. అదేవిధంగా సంగారెడ్డిలో స్వచ్ఛ తాగునీరు అందించేందుకు మరో రూ.15 కోట్ల నిధులు ఇచ్చామని పనులు పూర్తయ్యయన్నారు. నల్లా కనెక్షన్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపారు.

రూ.500 కోట్లతో సంగారెడ్డికి మెడికల్ కాలేజ్..

సంగారెడ్డి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డికి రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేశారని, పనులు త్వరితగతిన నడుస్తున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో 650 పడకలు ఇక్కడ అందుబాటులోకి వస్తుందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 100 మంది డాక్టర్లను నియమించామన్నారు. ఆసుపత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్, క్యాన్సర్ రోగులకు చికిత్స, 12 మంది గైనకాలజిస్టులను నియమించామని తెలిపారు. ఆసుపత్రిలో సాధారణ డెలివరీలు ప్రోత్సహించాలని, సి సెక్షన్ వల్ల తల్లి, బిడ్డకు నష్టం జరుగుతుందని, 30 ఏళ్ల వయసు వస్తే చాలు బరువులు మోయలేరన్నారు. అదేవిధంగా ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యుల సూచన మేరకు అవసరం అయితే తప్ప సి సెక్షన్ కి వెళ్లకూడదని, నార్మల్ డెలివరీ చేయాలని వైద్యులను అడగాలన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే సాధారణ ప్రసవం ముఖ్యమని, మొదటి గంటలో పుట్టిన బిడ్డకు ముర్రు పాలు అందించడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు.

బస్తీల సుస్తీని పోగొట్టేందుకు బస్తీ దవాఖానలు

బస్తీలలో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. పేదలుకు వారి బస్తీలలోనే ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని, సంగారెడ్డిలో బస్తీ దవాఖానల ద్వారా మంచి వైద్యం అందుతుందన్నారు. 17వ వార్డులో కొత్తగా బస్తీ దవాఖాన సంగారెడ్డిలోని ప్రారంభించుకున్నామని తెలిపారు. బస్తీ దవాఖానలు ప్రజల సుస్తీని పోగొట్టి, దోస్తీ దవాఖానగా మారాయని, పైసా ఖర్చు లేకుండా వైద్యం, పరీక్షలు, మందులు అందుతున్నాయన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు, వీది వ్యాపారాలు చేసుకునేవారికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ డా. శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షీ షా, వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బింగుల విజయలక్ష్మీ, వైస్ చైర్ పర్సన్ లతా విజయేందర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మానిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్లు విజయేందర్ రెడ్డి, ప్రభుగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జడ్పీటీసీ కొండల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నర్సింలు, చిల్వేరి ప్రభాకర్, మధుసూదన్ రెడ్డి, అశోక్, దుర్గప్రసాద్, ప్రవీన్ కుమార్, మల్లాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రావన్ రెడ్డి, జలేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: TS EAMCET విద్యార్ధులకు అలర్ట్.. కొత్త షెడ్యూల్ విడుదల!


Next Story

Most Viewed