రికార్డు స్థాయికి బంగారం దిగుమతులు.. 29% పెరిగిన డిమాండ్

by Malleboina Mahesh |   (  Updated:2026-04-06 05:47:55  IST  )

దేశంలోకి భారీగా పెరిగిన బంగారం దిగుమతులు! ₹6.5 లక్షల కోట్లకు చేరిన విలువ. ధరలు ₹1.5 లక్షలు దాటడంతో వాణిజ్య లోటు ₹29 లక్షల కోట్లకు చేరిక.

రికార్డు స్థాయికి బంగారం దిగుమతులు.. 29% పెరిగిన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు అసాధారణ రీతిలో పెరిగినట్లు తెలుస్తుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, పసిడి దిగుమతులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 28.73% వృద్ధి చెందాయి. వీటి మొత్తం విలువ సుమారు $69 బిలియన్లు (సుమారు ₹6.5 లక్షల కోట్లు) గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువ క్షీణత కారణంగా దేశీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం ఈ విలువ పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ప్రస్తుతం దేశ రాజధానితో పాటు పలు ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే బంగారం దిగుమతులు భారీగా పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా వాణిజ్య లోటు పై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి దేశ మొత్తం వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా) ₹29.20 లక్షల కోట్లకు ($310.60 బిలియన్లు) చేరింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది ₹24.60 లక్షల కోట్లుగా ($261.80 బిలియన్లు) ఉండటం గమనార్హం. కాగా, భారత్‌కు అందుతున్న బంగారంలో అత్యధికంగా 40% వాటా ఒక్క స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దిగుమతులను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వెండి, ప్లాటినం వంటి లోహాలపై కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ, పసిడి మోజు మాత్రం తగ్గడం లేదు.

Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం ధర

Next Story