లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. కాసేపట్లో విచారణకు విజయసాయి రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-22 03:21:17  IST  )

జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. కాసేపట్లో విచారణకు విజయసాయి రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: జగన్ (Jagan) ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న ప్రతి ఒక్కరినీ ఈడీ వరుసగా విచారించనుంది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు తాజాగా ఇవాళ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)ని విచారించనున్నారు. మద్యం పాలసీ రూపకల్పనలో ఆయనే కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. 2019-2024 మధ్య కాలంలో రూపొందించిన మద్యం విధానం వెనుక ఉన్న ఉద్దేశాలు, మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపుపై ప్రశ్నించనున్నారు. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా నగదును విదేశాలకు తరలించినట్లు వస్తున్న హవాలా ఆరోపణలపై అధికారులు ప్రశ్నలు సంధించి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.

రేపు ఎంపీ మిథున్ రెడ్డి విచారణ..

కాగా, ఇదే కేసులో రేపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సిట్ (SIT) చేత అరెస్ట్ అయి బెయిల్‌పై ఉన్న మిథున్ రెడ్డిని, ఇప్పుడు మనీలాండరింగ్ అంశంపై ఈడీ ప్రశ్నించనుంది. నిధుల మళ్లింపులో ఆయన ప్రమేయంపై ఆధారాలను ఈడీ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు రూ.3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లుగా దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో వరుసగా ఇద్దరు కీలక నేతలను ఈడీ విచారించనుండటం ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Read More..

ఒక్కసారికే తీరని నష్టం.. ఇప్పుడు మళ్లీనా: జగన్ పాదయాత్రపై మంత్రి రియాక్షన్

Next Story