బంగ్లాదేశ్‌లో కాల్పుల కలకలం: బీఎన్‌పీ నేత అజీజుర్ రెహమాన్ దారుణ హత్య

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 04:15:51  IST  )

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అనుబంధ విభాగం 'స్వేచ్ఛాసేవక్ దళ్' (ఢాకా సిటీ నార్త్) మాజీ ప్రధాన కార్యదర్శి అజీజుర్ రెహమాన్ ముబ్బషిర్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.

బంగ్లాదేశ్‌లో కాల్పుల కలకలం: బీఎన్‌పీ నేత అజీజుర్ రెహమాన్ దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అనుబంధ విభాగం 'స్వేచ్ఛాసేవక్ దళ్' (ఢాకా సిటీ నార్త్) మాజీ ప్రధాన కార్యదర్శి అజీజుర్ రెహమాన్ ముబ్బషిర్‌ (Azizur Rahman Mubbashir)ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. తేజ్‌తురి బజార్ ప్రాంతంలో రాత్రి 8:40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్టార్ కబాబ్ హోటల్ సమీపంలోని సందులో ముబ్బషిర్, కార్వాన్ బజార్ వ్యాన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబూ సుఫియాన్ మసూద్ నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు వారిపై కాల్పులు జరిపి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడిన ముబ్బషిర్‌ను బీఆర్‌బీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కడుపులో బుల్లెట్ దిగడంతో తీవ్రంగా గాయపడిన మసూద్‌ను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుడు ముబ్బషిర్ అవామీ లీగ్ పాలనలో రాజకీయ కారణాలతో పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. 2020లో కార్పొరేటర్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ఫిబ్రవరి 12న జరగనున్న జాతీయ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ హత్య స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనకు నిరసనగా సోనార్‌గావ్ కూడలి వద్ద బీఎన్‌పీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను అనుకరిస్తూ వెటకారం

Next Story