"కోవా బన్" వ్యవహారంపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2026-02-15 12:08:02  IST  )

"కోవా బన్" వ్యవహారానికి మతం రంగు పూయడం సరైంది కాదని MIM నేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.

కోవా బన్ వ్యవహారంపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : మేడారం జాతర సందర్భంగా చెలరేగిన “కోవా బన్” వివాదంపై MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నుంచి వచ్చిన వలీ అనే ముస్లిం చిన్న వ్యాపారిని లక్ష్యంగా చేసుకొని కొందరు యూట్యూబర్లు "ఫుడ్ జిహాద్" అంటూ వీడియోలు చేయడం, అన్ హైజీన్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పట్ల ఆయన గట్టిగా స్పందించారు. ఒక చిన్న వ్యాపారి జాతర సమయంలో తన కుటుంబ పోషణ కోసం వస్తువులు అమ్ముకుంటుంటే, అతనిపై మతరంగు పులిమి వీడియోలు తీయడం అన్యాయమని ఒవైసీ పేర్కొన్నారు. "ఇది ఏమిటి? ఒక మనిషి పొట్టకూటి కోసం కష్టపడుతున్నాడు. ఇలాంటి వీడియోల వల్ల అతని కుటుంబమే కాదు, లక్షల మంది చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఫుడ్ సేఫ్టీ సమస్య ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ, యూట్యూబ్‌లో డ్రామా చేసి మత విద్వేషం రెచ్చగొట్టడం ఎందుకు?" అని తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ప్రశ్నించారు.

నిజంగానే ఫుడ్ హైజీన్ సమస్య అయితే ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కు నివేదించాలని, కానీ వ్యూస్ కోసం సోషల్ మీడియాలో మతపరమైన వివాదాలకు పూనుకోవడం సమాజానికి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి కంటెంట్ సృష్టించే యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి మత విద్వేషం పెంచే ప్రయత్నాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఒవైసీ ప్రకటనతో కోవా బన్ వివాదం మరింత చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో కూడా సామాన్య ప్రజలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. ఓ చిరు వ్యాపారిని ఇబ్బంది పెట్టడం ఏమిటని సదరు యూట్యూబ్ ఛానెల్ పై మండిపడుతున్నారు. అంతేకాదు ఏపీ మంత్రి నారా లోకేష్ కోవా బన్ చిరు వ్యాపారి షేక్ షావలికి మద్దతు తెలిపారు. త్వరలోనే వలిని కలిసి, కోవా బన్ టేస్ట్ చేస్తానని హామీ ఇచ్చారు.

వలిని కలుస్తా.. కోవా బన్ తింటా.. నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు

Next Story