ఘోర ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

by Muthe.Rajitha |   (  Updated:2026-04-23 03:57:29  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో మీర్జాపూర్-రీవా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

ఘోర ప్రమాదం.. 11 మంది సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో మీర్జాపూర్-రీవా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంకర లోడుతో వేగంగా వెళ్తున్న ఒక భారీ ట్రక్కు అదుపు తప్పి ముందు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి స్విఫ్ట్ కారు దాని ముందున్న బోలెరో వాహనాన్ని బలంగా తగిలింది. ఈ వరుస ప్రమాదం జరిగిన వెంటనే ఊహించని విధంగా బోలెరో వాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వాహనం అంతటా వ్యాపించడంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 9 మంది బోలెరోలోనే సజీవ దహనం కావడం చూసేవారిని కలిచివేసింది.

ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా మృతి చెందారు. ట్రక్కు వేగంగా ఢీకొట్టడం వల్ల వాహనాలు నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, మంటలు అంటుకోవడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు ఆర్తనాదాలు చేసినా, మంటల తీవ్రత కారణంగా వారు వాహనాల నుండి బయటపడలేకపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ భారీ ప్రాణనష్టానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఉగ్రకుట్రపై అనుమానాలు!

Next Story