కాంగ్రెస్ గ్రాఫ్‌పై కేసీఆర్ ఆందోళన.. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఫ్లాష్ సర్వేలు

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ గ్రాఫ్‌పై కేసీఆర్ ఆందోళన.. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఫ్లాష్ సర్వేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఫ్లాష్ సర్వేలు జరిపిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. రెండు పార్టీల మధ్య ఎంత మేరకు గ్యాప్ ఉంది? కాంగ్రెస్ ఎందుకు బలంగా ఉంది? వంటి వివరాలను సేకరిస్తూ.. బీఆర్ఎస్‌కు ఉన్న బలహీనతలను అంచనా వేస్తున్నది. ఇందుకోసం కాంగ్రెస్ బస్సుయాత్ర కొనసాగిన ప్రాంతాలు, కేసీఆర్ నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో రెండు పార్టీల బలాబలాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ గ్రాఫ్‌పై ఆందోళన

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పట్ల ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడిందనే ప్రచారం ఉంది. ప్రధానంగా మహిళలు ఆకర్షితులవుతున్నట్టు టాక్ ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు కౌంటర్ మేనిఫెస్టోను ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ కు పాజిటివ్ ఏర్పడిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్టు ప్రగతిభవన్ కు సన్నిహితంగా ఉండే లీడర్లు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగిన ప్రాంతాల్లోనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. రాహుల్ రోడ్ షో తరువాత కాంగ్రెస్ గురించి ఏమనుకుంటున్నారు? అదే సమయంలో బీఆర్ఎస్ గురించి ఏ విధంగా స్పందిస్తున్నారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు.

కేసీఆర్ సభల ఎఫెక్ట్ ఎంత?

ఈనెల 15 న ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన తరువాత సీఎం కేసీఆర్ వరుసగా నాలుగు రోజుల పాటు ఏడు పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కొనసాగిస్తన్న స్కీమ్స్, మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేసే కొత్త హామీల గురించి ప్రజలకు వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్, ఆపార్టీ లీడర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే కేసీఆర్ పబ్లిక్ మీటింగ్స్ పాల్గొన్న ఏరియాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ గురించి ఏమనుకుంటున్నారు? అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

షాక్‌కు గురవుతున్న గులాబీ లీడర్లు!

ఫ్లాష్ సర్వే రిపోర్టులు చూసి బీఆర్ఎస్ లీడర్లే షాక్ గురువుతున్నట్టు తెలిసింది. మేనిఫెస్టో లోని అంశాలు, కేసీఆర్ పబ్లిక్ మీటింగ్స్ ద్వారా బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో జోష్ పెరుగుతుందని అంచనా వేశారు. కేసీఆర్ స్పీచ్‌కు ప్రజల నుంచి అనుకున్నట్టుగా పాజిటివ్ రియాక్షన్ రాలేదనే అనుమానం లీడర్లలో కనిపిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ నిర్వహించే సభలకు ప్రజలు స్వచ్ఛందంగానే వచ్చేవారు. కేసీఆర్ ప్రసంగం విన్నాక జోష్‌లో కనిపించేవారు. కానీ ప్రస్తుత సభలకు ప్రజలను తరలించడం చాలెంజ్‌గా మారిందని, డబ్బులు ఇస్తే తప్పా జనాలు వచ్చే అవకాశం లేదని గులాబీ లీడర్లు ఆవేదన చెందుతున్నారు.


Read More..

రాహుల్ ఎంట్రీతో రాష్ట్రంలో మారిన సీన్.. నేతల మదిలో ‘YSR యాత్ర’ స్మృతులు!

రండి.. మాట్లాడుదాం.. గజ్వేల్ నాయకులకు CM KCR స్పెషల్ ఇన్విటేషన్

Next Story