తొలి డెంగ్యూ వ్యాక్సిన్ రెడీ.. క్యూడెంగాకు ఆమోదం తెలిపిన డీసీజీఐ

by I. Sairam |

భారత్ లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. దీంతో దీనిని దేశంలో వినియోగించేందుకు మార్గం సుగమం అయ్యింది.

తొలి డెంగ్యూ వ్యాక్సిన్ రెడీ..  క్యూడెంగాకు ఆమోదం తెలిపిన డీసీజీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో తొలిసారిగా డెంగ్యూ వ్యాధి నివారణ కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌కు మార్కెట్ అనుమతులు లభించాయి. తకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా సంస్థ తయారు చేసిన ‘క్యూడెంగా’ (టీఏకే-003) వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మార్కెట్ అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. క్యూడెంగా అనేది లైవ్-అటెన్యూయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్, ఇది డెంగ్యూ వైరస్‌కు చెందిన నాలుగు రకాల (సెరోటైప్‌లు) నుండి రక్షణ కల్పించేందుకు రూపొందించారు. ఈ వ్యాక్సిన్ 4 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వారికి మూడు నెలల వ్యవధితో రెండు డోసులుగా అందిస్తారు. ఓ వ్యక్తికి గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చిందో, లేదో అనే దానితో సంబంధం లేకుండా ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వొచ్చని, వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి ముందస్తు పరీక్షలు అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. గత రెండు దశాబ్దాలలో దేశంలో 1డెంగ్యూ కేసుల సంఖ్య దాదాపు 11 రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న డెంగ్యూ కేసుల్లో మూడో వంతు భారత్‌లోనే ఉంటున్నాయి. ఈ వ్యాధి భారత్‌లో తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా మారిన నేపథ్యంలో డీసీజీఐ ఆమోదం తెలిపింది. కాగా.. క్యూడెంగా వ్యాక్సిన్‌కు ఆసియా, లాటిన్ అమెరికా, ఐరోపాల్లోని 43 దేశాలలో ఇప్పటికే ఆమోదం లభించిందని, దాదాపు 3.2 కోట్ల డోసులను ఆయా దేశాలలో పంపిణీ చేసినట్లు తయారీ సంస్థ తెలిపింది. భారత్ లో కూడా ఈ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించింది.

Next Story