రండి.. మాట్లాడుదాం.. గజ్వేల్ నాయకులకు CM KCR స్పెషల్ ఇన్విటేషన్

by Disha Web Desk 4 |
రండి.. మాట్లాడుదాం.. గజ్వేల్ నాయకులకు CM KCR స్పెషల్ ఇన్విటేషన్
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : రండి... మంచి చెడ్డలు కలిసి మాట్లాడుకుందాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, ముఖ్య కార్యకర్తలకు ఆహ్వానం పంపారు. చాలా రోజులుగా పెద్ద సారును కలుసుకోవాలని నాయకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పిలుపు అందడంతో వారంతా సంతోషిస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి 20 మంది ముఖ్య కార్యకర్తలు వచ్చేలా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా అంతాయపల్లిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప ఫంక్షన్ హాలులో ఈ సమావేశం ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలివెళ్లేలా ప్రతాప్ రెడ్డి తగు ఏర్పాట్లు చేశారు.

సారొస్తున్నారని సంతోషంగా...

సీఎం కేసీఆర్ తమ ఎమ్మెల్యే అని సంతోషం ఉన్నప్పటికీ సారును దగ్గరగా కలుసుకుని తమ బాధలు, సంతోషాన్ని పంచుకోలేకపోతున్నామని వెలితి ఎప్పటినుంచో ఉన్నది. ప్రధానంగా ప్రజాప్రతినిధులు కనీసం ఒక్కసారైనా సీఎంతో మాట్లాడలేకపోయామని బాధపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో కలిసి మాట్లాడుకుందాం రండి.. అంటూ సీఎం నుంచి పిలుపు అందడంతో నాయకులు, ముఖ్య కార్యకర్తలు సంతోష పడుతున్నారు. రాజకీయ పరిస్థితులు, ఇతర అన్ని అంశాలతో నేరుగా సీఎంతో చెప్పుకోవచ్చునని భావిస్తున్నారు. నియోజకవర్గంలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్ పూర్, ములుగు, మర్కుక్, వర్గల్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల నుంచి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు.

గ్రామానికి 20 మంది చొప్పున...

నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి 20 ముఖ్య కార్యకర్తలు మాత్రమే సీఎం సమావేశానికి వచ్చేలా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పేర్ల లిస్ట్ రూపొందించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆయా గ్రామాల నాయకులతో మాట్లాడి తమ పేర్లు లేవని, పిలవలేదని ఎవరూ ఇబ్బంది పడకుండా అందరినీ సమన్వయం చేస్తున్నారు. గ్రామాల్లో ఉండే లీడర్లే వారి సొంత వాహనాల్లో తరలివచ్చేలా చూస్తున్నారు. వాహనాలు లేకపోతే ప్రత్యేకంగా వాహనాలు పంపించే ఏర్పాట్లు చేశారు.

దిశా నిర్దేశం చేయడానికి....

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం ముచ్చటగా మూడోసారి గజ్వేల్ నుంచి పోటీలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాయకులు, ముఖ్య కార్యకర్తలకు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళదాం, ప్రత్యర్థుల కుట్రలను ఎలా తిప్పికొట్టాలి, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా మంత్రి హరీశ్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

అంతాయపల్లిలో ఉదయం 10 గంటలకు...

మేడ్చల్ జిల్లా అంతాయపల్లిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప ఫంక్షన్ హాలులో శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశం మొదలు కానున్నది. ఇందుకోసం అక్కడ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేశామని, సీఎంతో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు నేరుగా మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు భారీ మెజార్టీయే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని నాయకులు చెబుతున్నారు.


Read More..

రాహుల్ ఎంట్రీతో రాష్ట్రంలో మారిన సీన్.. నేతల మదిలో ‘YSR యాత్ర’ స్మృతులు!



Next Story

Most Viewed