సొంత కూటమిలో బీజేపీ ప్లాన్.. ఏక్‍నాథ్ షిండే, నితీశ్ కుమార్.. నెక్స్ట్ చంద్రబాబేనా?

by Prasad Jukanti |   (  Updated:2026-03-05 14:55:03  IST  )

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీని ప్రభావం తర్వాత ఏపీ రాజకీయాల్లో ఉండబోతోందా?

సొంత కూటమిలో బీజేపీ ప్లాన్.. ఏక్‍నాథ్ షిండే, నితీశ్ కుమార్.. నెక్స్ట్ చంద్రబాబేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్‍లో చోటు చేసుకుంటన్న రాజకీయ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం హాట్ టాపిక్‍గా మారింది. ఇన్నాళ్లు బిహార్ రాజకీయాలను శాసించిన నితిశ్‍కుమార్ ఇలా సీఎం పోస్టును వదులుకుని రాజ్యసభ బాట పట్టడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా మెజార్టీ స్థానాలు కలిగి ఉన్న జేడీయూ స్థానంలో బీజేపీ నేత బిహార్‍కు సీఎంగా కాబోతున్నారని ఇందుకు నితీశ్ కుమార్ సహకరిస్తున్నారనే చర్చ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో మరింత ఉత్కంఠ రేపుతోంది. దీంతో నితీశ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆయన సొంత ఆలోచన ఉందా లేక ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగమా జరిగిపోతోందా?..

నితీశ్ నిర్ణయం ఆశ్చర్యం:

బిహార్‍కు పదోసారి ముఖ్యమంత్రిగా గతేడాది నవంబర్‍లో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ సీఎం అభ్యర్థిగానే ఎన్డీయే కూటమి బరిలోకి దిగింది. దీంతో తిరుగులేని విజయం సాధించింది. అలాంటిది నితిశ్ కుమార్ ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని వదులుకుని రాజ్యసభకు వెళ్లబోతుండటం హాట్ టాపిక్‍గా మారింది. నిజానికి నితీశ్ కుమార్‍కు జాతీయ రాజకీయాలు కొత్తేమి కాదు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన అనువం ఉంది. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తప్పుకునేందుకు ఈ మార్గం వెతుక్కున్నారా అనేది మరో సందేహాం. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం నితీశ్ తప్పుకోవడం వెనుక బీజేపీ పక్కా ప్లాన్ అనే వాదన తెరపైకి తెస్తున్నారు.

నితీశ్‍కు ముందు షిండే:

ఇందుకు గతంలో మహారాష్ట్రలో ఏక్‍నాథ్ షిండే ఉదాంతాన్ని ఎగ్జామ్ పుల్ గా చూపిస్తున్నారు. షిండే విషయంలోనూ బీజేపీ ఇలానే వ్యవహరహించిందని ఇప్పుడు నితీశ్ కుమార్ విషయంలో అదే చేస్తోందనే చర్చ వినిపిస్తోంది. మహారాష్ట్రలో కొన్ని దశాబ్దాల పాటు రాజకీయంగానే కాదు సైద్ధాంతికంగా మిత్రపక్షాలుగా ఉన్న శివసేన (ఉమ్మడి) 2019 ఎన్నికల సమయంలో సీఎం పోస్టు కోరింది. అందుకు బీజేపీ నిరాకరించింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ఉద్దన్ థాక్రే సీఎం పీఠం ఎక్కగా కొన్నాళ్లకు ఏక్ నాథ్ రూపంలో ఆ ప్రభుత్వం కూలిపోయింది. దీని వెనుక బీజేపీ ఉందనే వాదన ఉంది. ఎందుకంటే ఈ పరిణామం తర్వాత ఏక్ నాథ్ షిండే బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగారు. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి ఘన విజయం సాధించినా సీఎం పోస్టు మాత్రం ఏక్ నాథ్ షిండేను కాదని బీజేపీనే తీసుకుంది. సీఎం పదవి విషయంలో మొన్న షిండేను పక్కన పెట్టిన బీజేపీ నితిశ్ కుమార్ ను తప్పిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బిహార్‍లో తొలి బీజేపీ సీఎం:

బిహార్ సీఎంగా నితిశ్ కుమార్ వారసుడు ఎవరూ అనేదానిపై చర్చ జరుగుతోంది. వినిపిస్తున్న ప్రచారం ప్రకారం బీజేపీకి చెందిన వ్యక్తి సీఎంగా ఉండబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, బీహార్ మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే సుదీర్ఘ కాలం పరిపాలించిన నితీశ్ కుమార్ తప్పుకోవడం ఆయన స్థానంలో బీజేపీ వ్యక్తి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే అతడే బిహార్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు కెక్కనున్నారు. కానీ కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో ఉండాలంటే నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ మద్దతు అనివార్యం. ఈ నేపథ్యంలో సీఎంగా తాను తప్పుకుని ఆ పదవిని బీజేపీకి అప్పగించడానికి నితీశ్ కుమార్ ఇష్టపూర్వకంగానే అంగీకరించారా? అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

చంద్రబాబుపై చర్చ:

ఏక్ నాథ్ షిండే, నితీశ్ కుమార్ పరిణామాలతో తాజాగా చంద్రబాబు విషయంలోనూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ విషయంలోనూ బీజేపీ ఇదే ప్లాన్ చేయబోతోందనే వాదనలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తోంది. భవిష్యత్‍లో చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‍లో పవన్ కల్యాణ్ ను సీఎంగా ప్రపోజ్ చేస్తుందనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ వాదనను టీడీపీ మద్దతుదారులు ఖండిస్తున్నారు. బిహార్, మహారాష్ట్ర వేరు ఏపీ పరిస్థితి వేరని ఈ ఊహాగానాలను తిప్పికొడుతున్నారు. ఏపీలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండటంతో పాటు ప్రస్తుతం చంద్రబాబు రాజకీయంగా ఆరోగ్యంగా చురుకుగా ఉన్నారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలను, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా డీల్ చేస్తున్నారు. ఒక వేళ ఆయనే తప్పుకోవాలని భావిస్తే ఆ చాన్స్ బీజేపీకి కాకుండా లోకేశ్ రూపంలో మరో ఆప్షన్ సిద్దంగా ఉండనే ఉంది. అందువల్ల ఏపీలో ఇలాంటి పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశాలు లేవని టీడీపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. మొత్తంగా మొన్న ఎక్‍నాథ్ షిండే నేడు నితీశ్ కుమార్ సీఎం పదవులకు దూరం కాగా నెక్స్ట్ ఎవరు అనేది మాత్రం జోరుగా చర్చనీయాశం అవుతోంది.

వద్దంటే వద్దు.. మీరు ఢిల్లీకి వెళ్లొద్దు".. నితీష్ నిర్ణయంపై జేడీయూ నేతల ఆందోళన

Next Story