మేడారంలో గద్దెలపైకి వనదేవతలు రాకముందే పోటెత్తిన భక్తులు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-28 07:40:12  IST  )

మేడారం జాతరలో వన దేవతలు గద్దెలపైకి రాకముందే భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీగా భక్తులు మేడారంకు దర్శనం కోసం వచ్చారు.

మేడారంలో గద్దెలపైకి వనదేవతలు రాకముందే పోటెత్తిన భక్తులు
X

దిశ, మేడారం న్యూస్ నెట్‌వర్క్: మేడారం జాతరలో వన దేవతలు గద్దెలపైకి రాకముందే భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీగా భక్తులు మేడారంకు దర్శనం కోసం వచ్చారు. జంపన్నవాగులో స్నానాలు చేసిన భక్తులు దర్శనం కోసం పోటెత్తారు. మేడారం గద్దెలు నిండిపోవడంతో పాటు క్యూ లైన్ నిండి కిలో మీటరు వరకు లైన్లు ఏర్పడ్డాయి. భక్తులు ఒకేసారి పెరుగుతుండటంతో అధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. వెంట వెంటనే దర్శనాలు జరిగే విధంగా చూస్తున్నారు. మేడారం ప్రాంగణంలో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. జంపన్న వాగు వద్ద శివసత్తులు, పూనకాలతో ఊగిపోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం మేడారంలోని గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చేరనున్నారు. కన్నెపల్లిలో సారలమ్మను తీసుకొచ్చేందుకు అధికారులు, పోలీసులు భారీ ఏర్పాట్లను చేశారు. కన్నెపల్లి నుంచి మేడారం ప్రధాన రహదారిలో భారీగా జనం ఉండటంతో సారలమ్మ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకొచ్చే విధంగా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు.

వనమంతా జనమే

మేడారం చుట్టుపక్కల వనములో ఎటు చూసినా జనమే ఉన్నారు. రాత్రులు వచ్చి దర్శనాలు చేసుకున్న భక్తులు వనంలో సేద తీరుతున్నారు. వంటలు చేసుకొని సారలమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మేడారం జాతర ప్రారంభం కావడంతో వరంగల్, ములుగు, పస్రా రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కరీంనగర్, రామగుండం వచ్చే వాహనాలన్నీ భూపాలపల్లి మీదుగా చేరుకుంటున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం నుంచి వచ్చే వాహనాలు ఏటురునాగరం మీదుగా వస్తున్నాయి. భక్తులు ఒకేసారి పెరుగుతుండటంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Similar News : వనదేవతలను దర్శించుకున్న ఇల్లందు ఎమ్మెల్యే

Next Story