BREAKING: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం: ముగ్గురు కార్మికులు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-27 13:21:29  IST  )

BREAKING: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం: ముగ్గురు కార్మికులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. వాతావరణం ఒక్కసారిగా మారింది. చిమ్మ చీకట్లు కమ్మేలా మబ్బులు పట్టడం, అదే సమయంలో వీచిన ఈదురుగాలుల ధాటికి ఓ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. శంకరపల్లి మండలం మహాలింగాపురంలో ఉన్న ఎన్ సీసీ (NCC) సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం వేళ కార్మికులు విధుల్లో ఉండగా, అకస్మాత్తుగా వాతావరణం మారి భారీ ఈదురుగాలులు వీచాయి. గాలుల ధాటికి కంపెనీలోని భారీ క్రేన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కార్మికులపై పడింది. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 13 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.

గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం శంకరపల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, కంపెనీలో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో మహాలింగాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తీరని విషాదం.. బిర్యానీ, పుచ్చకాయ తిని కుటుంబంలోని నలుగురి మృతి!

Next Story