BREAKING: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా తిప్పిరి తిరుపతి నియామకం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-09 08:09:54  IST  )

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే.

BREAKING: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా తిప్పిరి తిరుపతి నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన మూడున్నర నెలల తర్వాత కొత్త సెక్రటరీని నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. కరీంనగర్ కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని కొత్త సెక్రటరీగా నియమించినట్లు తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు కూడా ఉన్నారని, అతనిపై రూ.1.5 కోట్ల రివార్డు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మృతుల మృతేదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కరణలు నిర్వహించారు.

మరోసారి తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు

దిశ, జగిత్యాల ప్రతినిధి/భద్రాచలం : వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీ కొత్త సారథిని ఎన్నుకున్నదని తెలుస్తున్నది. ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(70) ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన మూడున్నర నెలల తర్వాత కొత్త పార్టీని పునర్‌వ్యవస్థీకరణ చేస్తూ మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చీఫ్, పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని సెక్రటరీగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. అయితే, మావోయిస్టు పార్టీ 15 రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అంచలంచెలుగా ఎదిగిన తిరుపతి

జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతుండగా రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌‌లో చేరాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరగడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్‌గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా, మిలీషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్‌ కేడర్‌ హోదాలో తిరుపతి పనిచేస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్‌జీగా పిలుచుకుంటారు. మిలీషియా దాడులు చేసి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్య అని నక్సల్స్ చెబుతారు. 2003లో తిరుపతి అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్‌ రిజర్వ్‌ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది తిరుపతి అని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలపై రూ. కోటి రివార్డు ఎన్‌ఐఏ ప్రకటించినట్లు సమాచారం.

Read More..

మావోయిస్టులకు షాక్.. లొంగిపోయిన మరో కీలక నేత

Next Story