పర్యవేక్షణ లేకుండా పనులా..? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

by Ratna Kumari |

మోత్కూరు చెరువు కట్ట మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అధికారులను ఆదేశించారు.

పర్యవేక్షణ లేకుండా పనులా..? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ, మోత్కూరు : మోత్కూరు చెరువు కట్ట మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చెరువు కట్ట వద్ద జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల వద్ద ఐబీ శాఖకు చెందిన వర్క్ ఇన్‌స్పెక్టర్, ఏఈ లేకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈఈతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, పనులు పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అధికారులు పనుల వద్దే ఉండి పర్యవేక్షిస్తేనే నాణ్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గతంలో కంటే మెరుగైన ప్రమాణాలతో చెరువు కట్ట పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈనెల 30 నాటికి ఓటరు నమోదు పూర్తి చేయాలి..

సర్ (ఓటరు నమోదు) ప్రక్రియ గడువును ప్రభుత్వం ఆగస్టు 3 వరకు పొడిగించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు ప్రతి ఇంటికీ వెళ్లి నమోదు ప్రక్రియను ఈ నెల 30 నాటికి పూర్తి చేసి బీఎల్‌వోలకు ఫారాలు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. పేదలు ఉపాధి కోసం వలస వెళ్లిన నేపథ్యంలో వారిని సంప్రదించి ఓటరు నమోదు పూర్తి చేయాలని, లేకపోతే అర్హులైన అనేక మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ ప్రక్రియను బాధ్యతగా పూర్తి చేయాలని కోరారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు 2.63 లక్షల ఓటర్లు ఉన్నారని, మరణించిన వారి పేర్లు తొలగించిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఎల్‌ఏలదేనని పేర్కొన్నారు. సమస్యలు ఎదురైతే నియోజకవర్గ ఇన్‌చార్జి పానుగంటి నరసింహారెడ్డి లేదా తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వంగరి రాములుతో పాటు కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి. లక్ష్మీనరసింహారెడ్డి, గడ్డం సోమనర్సయ్య, రాచకొండ బాలరాజు, జి. రామచంద్ర గౌడ్, డాక్టర్ రావు వర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story