Munugode by-poll: బరిలో నిలిచేదెవరో.. మునుగోడు తేలేది నేడే!

by Disha Web Desk 2 |
Munugode by-poll: బరిలో నిలిచేదెవరో.. మునుగోడు తేలేది నేడే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు ముగియనున్నది. ఈ ఎన్నికల్లో మొత్తం 130 మంది 199 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కానీ పరిశీలనా క్రమంలో అందులో 47 మంది నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో 47 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఆమ్ ఆద్మీ, శివసేన, తెలంగాణ పునర్ నిర్మాణ సమితి, ఇండియా ప్రజాబంధు, జై మహాభారత్ తదితర పార్టీల తరఫున దాఖలైన నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. చివరకు పోటీలో 83 మంది ఉన్నారు. ఇందులో 14 మంది వివిధ జాతీయ, ప్రాంతీయ (రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన) పార్టీలకు చెందిన అభ్యర్థులుకాగా, మిగిలిన 69 మంది ఇండిపెండెంట్‌లు.

గెలుపు కోసం ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. వందల సంఖ్యలో ఓట్ల తేడా వచ్చినా అది ప్రభావం చూపుతుందనే భయం వాటిల్లో మొదలైంది. వీలైనంత వరకు చిన్న పార్టీల, స్వతంత్ర అభ్యర్థులను పోటీలో లేకపోతే బాగుండని భావిస్తున్నాయి. వారితో సంప్రదింపులు జరిపి పోటీ నుంచి తప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బరిలో ఉన్న 83 మందిలో ఆదివారం పది మంది పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో 73 మంది పోటీలో ఉన్నట్లయింది. వివిధ పార్టీల ప్రయత్నాల తర్వాత సోమవారం ఎంత మంది నామినేషన్లను ఉపసంహరించుకునేది స్పష్టతమవుతుంది. పదుల సంఖ్యలోనే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నది.

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని అన్ని పార్టీలూ అంచనా వేశాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నందున మెజారిటీ ఈసారి తక్కువే ఉండొచ్చని భావించాయి. ఓట్ల చీలిక ప్రభావం గణనీయంగానే ఉంటుందనే ఆలోచనతో పోటీ నుంచి తప్పించేందుకు మొదట్లోనే ఆలోచనలు చేశాయి. మరికొన్ని గంటల్లో ఉపసంహరణ గడువు ముగుస్తుండడంతో ఓట్ల చీలిక అంచనాకు అనుగుణంగా బేరసారాలు, ప్రలోభాలు మొదలయ్యాయి. వాటికి ఎంత మంది అభ్యర్థులు లొంగి నామినేషన్లను ఉపసంహరించుకుంటారనేది సోమవారం సాయంత్రంతో స్పష్టతకు రానున్నది. మునుగోడు నియోజకవర్గంతో సంబంధంలేని అభ్యర్థులు కూడా నామినేషన్లను దాఖలు చేయడంతో వారి ప్రభావం పెద్దగా ఉండదనే భావన ప్రధాన పార్టీల్లో నెలకొన్నది.

బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ జనసమితి లాంటి పార్టీలు చీల్చే ఓట్లు ప్రధాన పార్టీలను ఇబ్బంది పెడుతున్నది. ఒకవైపు సామాజిక సమీకరణం, మరోవైపు ఇంటిపేర్లు, వ్యక్తుల పేర్లు ఓటర్లను కన్‌ప్యూజ్ చేసే ఆస్కారమున్నది. ఈ నియోజకవర్గంలో దళితుల ఓట్లు 35 వేలకు పైగా ఉన్నందున బీఎస్పీ తరఫున పోటీచేసే ఆందోజు శ్రీకాంతాచారి భారీ స్థాయిలో చీలుస్తారనే భయం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లను కలవరపెడుతున్నది. ఏ పార్టీ ఓట్లు చీలుతాయి, ఏ పార్టీపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, చీలిక ఓట్లతో లబ్ధి కలిగేది ఏ పార్టీకి... ఇలాంటి లెక్కలు మొదలయ్యాయి. ప్రలోభాలతో ఈ పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే వీలు లేకపోవడంతో ఓట్ల చీలిక ప్రభావం, దానికి విరుగుడు ఏం చేయాలనేది అనివార్యమైంది.

ఇవి కూడా చదవండి : రంగంలోకి కాషాయ దళపతి బండి సంజయ్.. ప్రచార అస్త్రం ఇదే!


Next Story

Most Viewed