- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ.. నగరవాసులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరుతున్న వాహనదారుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్డెస్క్: నగరంలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్న వేళ, తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రజారవాణాను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ పరిధిలో నడిచే మెట్రో ఏసీ (Luxury) మరియు డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరపై 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. "బంకుల వద్ద వేచి ఉండి సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకు దండగ.. సురక్షితమైన ఆర్టీసీ బస్సులు ఉండగా" అని ఎండీ వ్యాఖ్యానించారు. పెట్రోల్ కోసం ఆందోళన చెందుతూ కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడవద్దని, దానికి బదులుగా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి హాయిగా ప్రయాణించాలని ఆయన సూచించారు.
సొంత వాహనాలపై వెళ్లే ఖర్చు కంటే.. 30 శాతం రాయితీతో కూడిన ఆర్టీసీ ప్రయాణం చాలా తక్కువ ధరకే లభిస్తుందని ఆయన గుర్తు చేశారు. నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో ఏసీ, డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంటాయని, ఈ రాయితీని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరింది. ఇంధన కొరత భయం వీడి, పర్యావరణహితమైన, చౌకైన ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రయాణికుల అవసరాల కోసం ప్రస్తుతం 3200 బస్సులను అందుబాటులో ఉంచినట్లు ఎండీ వెల్లడించారు. నగరంలోని అన్ని ప్రధాన రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచి, ప్రజలు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే దానికి అనుగుణంగా డిపోల్లో ఉన్న రిజర్వ్ బస్సులను కూడా రోడ్లపైకి తెచ్చేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.






