- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పశ్చిమాసియాలో యుద్ధం బీభత్సం సృష్టిస్తున్న వేళ గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వాసుల భద్రత కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసుల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులకు, కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని (Control Room) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, తెలంగాణ భవన్లోని కంట్రోల్ రూమ్ నిరంతరం అందుబాటులో ఉండనుంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు ల్యాండ్లైన్ నెంబర్ 011-23380556కు అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ వందర బరువా +91 98719 99044, లైజన్ ఆఫీసర్ జి.రక్షిత్ నాయక్ +91 96437 23157, పీఆర్వో సీహెచ్ చక్రవర్తి +91 99493 51270 నెంబర్లలో అందుబాటులో ఉండనున్నారు.
అదేవిధంగా తెలంగాణ భవన్ (Telangana Bhavan) అధికారులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA), ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో (Embassies) నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 15 లక్షల మంది తెలంగాణ వాసులు నివసిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారులు అంచనా వేవారు. ఇందులో ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారిలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సహాయం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. విమాన సర్వీసుల రద్దు కారణంగా విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికుల వివరాలను సేకరించి, వారికి వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణ వాసులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎంవో వర్గాలు తెలిపాయి.






