తెలంగాణ ‘మున్సిపల్’ పోరు.. పటిష్ట భద్రత మధ్య ప్రారంభమైన పోలింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-11 03:07:58  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.

తెలంగాణ ‘మున్సిపల్’ పోరు.. పటిష్ట భద్రత మధ్య ప్రారంభమైన పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ (Municipal election Polling) అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. ముందుగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది కేంద్రం బయట అభ్యర్థుల జాబితా, పోలింగ్ కేంద్రం పరిధి వంటి నోటీసులను అంటించారు. ఉదయం 6.30కి పోటీలో ఉన్న అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఖాళీ బ్యాలెట్ బాక్సులను చూపించి ప్రత్యేకమైన పేపర్ సీల్స్, అడ్రస్ ట్యాగ్‌లతో వాటిని సీల్ చేశారు. అనంతరం ప్రొసీడింగ్స్‌పై ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేశారు. సరిగ్గా ఉదయం 7 గంటలు ఓటర్లను ఓటేసేందుకు పోలింగ్ కేంద్రంలోని అనుమతించారు. అయితే, సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఒకవేళ సమయం దాటిపోయినా క్యూ లైన్ ఉంటే.. పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.

8,191 పోలింగ్ కేంద్రాలు..

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో నిలిచిన 12,944 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 51,17,413 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 41వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు. 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచారు.

పటిష్టమైన ఏర్పాట్లు..

ఇక ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి 2,948, బీఆర్‌ఎస్​నుంచి 2,879, బీజేపీ నుంచి 2,634, జనసేన నుంచి 332, ఎంఐఎం నుంచి 282, ఇతరులు, స్వతంత్రులు 3,034 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. విశేషమేమిటంటే, పురుష ఓటర్లు 25,49,750 కంటే మహిళా ఓటర్లు 26,67,025 ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు 638 మంది ఇతర ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. మొత్తం 8,191 కేంద్రాలను ఏర్పాటు చేయగా, అన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు. మొత్తం 41,773 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16,382 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్ పర్సన్లు, వైస్‌ చైర్ పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Municipal Elections:ఓటేద్దాం.. పదండి..!

Next Story