తెలంగాణ ఏర్పాటును పాక్ విభజనతో పోల్చడమా?.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై నిరంజన్‌రెడ్డి ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-16 12:07:21  IST  )

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణ ఏర్పాటును పాక్ విభజనతో పోల్చడమా?.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై నిరంజన్‌రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని, చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తీరును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. "తెలంగాణ రాష్ట్రం ఏదో యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు. ఇది కొన్ని దశాబ్దాల పాటు సాగిన ప్రజా ఉద్యమం, వేలాది మంది అమరుల త్యాగాలు, కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితం" అని ఆయన స్పష్టం చేశారు. తేజస్వీ సూర్య అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శిస్తూ నిరంజన్‌రెడ్డి సీరియస్ అయ్యారు.

రాజ్యాంగబద్ధ ప్రక్రియ..

తెలంగాణ రాష్ట్రం భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో ఏర్పడింది. దేశ అత్యున్నత చట్టసభ ఆమోదించిన బిల్లు ద్వారా ఏర్పడిన రాష్ట్రాన్ని, దేశ విభజనతో పోల్చడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడటం తెలంగాణ సమాజాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం చరిత్రను, ప్రజల సెంటిమెంట్లను వాడుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తేజస్వీ సూర్యకు తగదని, తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

పాకిస్థాన్‌‌ను చేసినట్లు చేశారు: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్

Next Story