‘కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం’.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-01 10:46:08  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం’.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంపద ప్రజా సంక్షేమానికి కాకుండా, కేవలం ఒకే ఒక్క కుటుంబం దాచుకోవడానికి, దోచుకోవడానికి ఉపయోగపడిందని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తన పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌తో కలిసి నడవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. "నేను కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, నా నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యం. స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, వారి ఆరాచక పద్ధతులు నచ్చకే తాను ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే..

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కడియం ఎద్దేవా చేశారు. గతంలో ఇతర పార్టీల నుండి 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకుని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతిని మొదలుపెట్టిందే కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబానికే తప్ప, సామాన్య ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని కడియం విమర్శించారు. కవిత చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని సవాల్ విసిరారు. పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని, అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.

కేసీఆర్ వల్లే ఆ పార్టీ నుండి బయటకు వెళ్లిపోతున్నారు.. కడియం సంచలన వ్యాఖ్యలు

Next Story