నేడు తెలంగాణలోకి ఎంటర్ కానున్న రాహుల్ యాత్ర.. రాష్ట్రంలో ఇదే రూట్!

by Disha Web Desk 2 |
నేడు తెలంగాణలోకి ఎంటర్ కానున్న రాహుల్ యాత్ర.. రాష్ట్రంలో ఇదే రూట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతి సమైక్యత కోసం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న కవాతు ఆదివారం రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నది. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు సాగుతున్న రాహుల్ భారత్​ జోడో యాత్ర రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్‌కు ముందడుగు వేయనుందని భావిస్తున్నారు. మొత్తంగా నాలుగు రాష్ట్రాలు దాటి 1500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న జోడో యాత్ర ఉమ్మడి మహబూబ్​నగర్‌లో రాష్ట్రంలోకి వస్తున్నది. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా పరిధి గూడబెల్లూరులో అడుగుపెట్టనున్నది. కర్నాటక, తెలంగాణా సరిహద్దులోని గూడబెల్లూరులో రాహుల్ భారత్ జోడో యాత్రను స్వాగతించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేసింది. గూడబెల్లూరులో అల్పాహారం అనంతరం మధ్యాహ్నం నుంచి యాత్ర దీపావళి నిమిత్తం మూడు రోజులపాటు అంటే 26వ తేదీ వరకు బ్రేక్ తీసుకోనున్నది.

అనంతరం 27 తేదీ ఉదయం గూడబెల్లూరులో ప్రారంభం కానున్న యాత్ర మక్తల్ చేరుకుని తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న యాత్ర తదనంతరం12 రోజులపాటు ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నర్ మీటింగులు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరికొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్‌లు చేస్తూ రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల మేర పాదయాత్రతో రాహుల్ ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్‌లోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్‌లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు.

రాష్ట్రంలో ఇదే రూట్​

రాష్ట్రంలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టే రాహుల్ పాదయాత్ర, నారాయణ్ పేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, రాజేంద్ర నగర్, బహుదూర్ పుర, చార్మినార్, గోషా మహల్, నాంపల్లి, ఖైతరాబాద్, కూకట్ పల్లి, శేరిలింగపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్నది. మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా కొనసాగనున్నది. ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలను దాటుతూ వచ్చిన రాహుల్ పాదయాత్రలో అతిపెద్దనగరం హైదరాబాద్ ప్రవేశించనుండగా నగరంలో ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్ వరకు సాగనుంది.

యాత్రలో మేధావులు, మత పెద్దలు, వివిధ వర్గాలు

రాష్ట్రంలో జరిపే యాత్రలో భాగంగా మేధావులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ వర్గాలు, మత పెద్దలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులతో భేటి అయ్యేందుకు ప్లాన్​ సిద్ధం చేశారు. వీరిలో కొందరు రాహుల్‌తో పాదం కలిపేందుకు సిద్దమవుతున్నారు. ప్రధానంగా రాహుల్ యాత్రలో కొన్ని ప్రార్థనా మందిరాలు, మజీదులు, హిందూ ఆలయాలను సందర్శించనున్నారు. సర్వమత ప్రార్థనలు కూడా చేయనున్నారు.

టీపీసీసీ విసృత ఏర్పాట్లు

భారత జాతి సమైక్యతా నినాదంతో తెలంగాణాలో అడుగుపెడుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రకు టీపీసీసీ విసృత ఏర్పాట్లు చేసింది. పలు బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నర్ సమావేశాలలో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పాదయాత్రలో అనుసరించాల్సిన విధివిదానాలతో పాటు రూట్ మ్యాప్‌పై పీసీసీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలు సారథ్యం వహించనున్న ఈ 13 కమిటీలతో పాదయాత్ర పొడవునా యాత్రను సమన్వయం చేసుకుంటూ రాహుల్‌తో కలిసి ముందుకు సాగనున్నారు.

ఇవి కూడా చదవండి: తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ.. TPCC గ్రాండ్ వెల్‌కల్

Next Story

Most Viewed