బ్రేకింగ్ : కవిత దీక్షకు ఢిల్లీ పోలీసుల ఆంక్షలు..

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : కవిత దీక్షకు ఢిల్లీ పోలీసుల ఆంక్షలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని శుక్రవారం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్న విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంలో కవిత దీక్షకు పోలీసులు ఆంక్షలు విధించడం సంచలనంగా మారింది. జంతర్ మంతర్ స్థలానికి బదులుగా మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. తొలుత ఢిల్లీ పోలీసులు దీక్షకు అనుమతి ఇచ్చారు. కాగా హఠాత్తుగా స్థలాన్ని మార్చుకోవాల్సిందిగా కవితకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయినా దీక్ష యధాతథంగా కంటిన్యూ అవుతుందని కవిత స్పష్టం చేశారు.

చివరి నిమిషంలో ఎందుకు అనుమతి నిరాకరించారో కారణాలను, వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగనున్నట్లు కవిత తెలిపారు. ఈ దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని కవిత వెల్లడించారు. సుమారు 16 రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నుంచి నేతలు, కార్యకర్తలు వస్తారని కవిత తెలిపారు. భారీ సంఖ్యలో జనం వస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు.

కానీ పోలీసులు ఆంక్షలు విధించడంతో శుక్రవారం జరగాల్సిన దీక్ష జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొన్నది. జమ్ము కశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్సు, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, అకాలీదళ్ పార్టీ నుంచి నరేష్ గుజ్రాల్, జేడీయూ నుంచి కేసీ త్యాగి, బిహార్ ఆర్జేడీ, ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాక్రే, ప్రియాంకా చతుర్వేది, డీఎంకే, ఆర్ఎల్‌డీ తదితర పార్టీల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.

Read more:

సోనియాకు సెల్యూట్.. : కవిత


Next Story