SEBI: సీడీఎస్ఎల్‌పై సెబీ రూ. కోటి జరిమానా

by S Gopi |

ఈ దాడి కారణంగా షేర్ల సెటిల్‌మెంట్ ప్రక్రియ 46 గంటల పాటు, ఒక డిపాజిటరీ నుండి మరో డిపాజిటరీకి జరిగే బదిలీలు ఏకంగా 54.5 గంటల పాటు నిలిచిపోయాయి.

SEBI: సీడీఎస్ఎల్‌పై సెబీ రూ. కోటి జరిమానా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల షేర్లను భద్రపరిచే ప్రముఖ డిపాజిటరీ సంస్థ 'సీడీఎస్ఎల్'పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ భారీ జరిమానా విధించింది. 2022, నవంబర్‌లో జరిగిన మాల్‌వేర్ (సైబర్) దాడి, అంతకుముందు సంస్థ పాటించిన సైబర్ సెక్యూరిటీ లోపాల కారణంగా సంస్థపై రూ. కోటి జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దాడి కారణంగా షేర్ల సెటిల్‌మెంట్ ప్రక్రియ 46 గంటల పాటు, ఒక డిపాజిటరీ నుండి మరో డిపాజిటరీకి జరిగే బదిలీలు ఏకంగా 54.5 గంటల పాటు నిలిచిపోయాయి. ఈ సుదీర్ఘ అంతరాయం మొత్తం సెక్యూరిటీల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిందని సెబీ పేర్కొంది. నిబంధనలను బేఖాతరు చేయడం, అమలు చేయాల్సిన భద్రతా ఆదేశాలను పక్కనపెట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది ముందే ఊహించదగినదేనని సెబీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సెబీ దర్యాప్తులో సీడీఎస్ఎల్ తీవ్రమైన అండర్‌గ్రౌండ్ భద్రతా లోపాలు బయటపడ్డాయి. హ్యాకర్లు 2021, నవంబర్‌లోనే సీడీఎస్ఎల్ సర్వర్లలోకి చొరబడగా.. సంస్థ దాన్ని ఏడాది తర్వాత గానీ గుర్తించలేకపోయింది. దీనికి తోడు, 2021లో క్రియేట్ చేసిన ఒక ముఖ్యమైన అడ్మిన్ అకౌంట్‌కు అసలు పాస్‌వర్డ్ ఎక్స్‌పైరీ డేట్ లేకుండా సెట్ చేయడం, తప్పు పాస్‌వర్డ్ కొడితే అకౌంట్ లాక్ అయ్యే 'లాకౌట్ పరిమితి' నిబంధనలను మాల్‌వేర్ దాడి జరిగే వరకు సడలించి వదిలేయడం వంటి తీవ్ర నిర్లక్ష్యాలు వెలుగుచూశాయి.

Next Story