కొనసాగుతోన్న బీసీ సంఘాల బంద్.. జిల్లాల్లో డిపోలకే పరిమితమైన బస్సులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-18 01:51:46  IST  )

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు, బీసీ ఆకాంక్ష ఢిల్లీ (Delhi)కి వినిపించేలా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)గా చేపడుతోన్న బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.

కొనసాగుతోన్న బీసీ సంఘాల బంద్.. జిల్లాల్లో డిపోలకే పరిమితమైన బస్సులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు, బీసీ ఆకాంక్ష ఢిల్లీ (Delhi)కి వినిపించేలా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)గా చేపడుతోన్న బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు, మేధావులు మద్దతు ప్రకటించారు. మరోవైపు దుకాణాలు, పెట్రోల్‌ బంకులు, ఇతర వ్యాపారులంతా బంద్‌కు స్వచ్ఛందంగా తమ మద్దతును తెలిపారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాల వారు బంద్‌లో పాల్గొంటున్నారు.

డిపోల ఎదుట ఆందోళనలు..

రాష్ట్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలించవద్దని సూచించారు. అవాంఛనీయ ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంద్ కారణంగా అన్ని జిల్లాల్లో బస్సులన్ని డిపోలకే పరిమితం అయ్యాయి. డిపోల ఎదటు బీసీ సంఘాలతో నేతలతో పాటు అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. బంద్ కారణంగా ఇవాళ ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరగనున్న పరీక్షలు వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఓయూ రిజిస్ట్రార్ తెలిపారు.

Read More..

ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన బీసీ నాయకులు.. బస్సులు వెళ్లకుండా ధర్నా!

Next Story