ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన బీసీ నాయకులు.. బస్సులు వెళ్లకుండా ధర్నా!

by Jakkula.Mamatha |   (  Updated:2025-10-18 01:53:59  IST  )

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఇచ్చిన బంద్‌కు హుజూరాబాద్ పట్టణంలో విశేష స్పందన లభించింది.

ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన బీసీ నాయకులు.. బస్సులు వెళ్లకుండా ధర్నా!
X

దిశ, హుజూరాబాద్ రూరల్: ​బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఇచ్చిన బంద్‌కు హుజూరాబాద్ పట్టణంలో విశేష స్పందన లభించింది. బంద్ పిలుపు విజయవంతమైంది. ఉదయం నుంచే బీసీ నాయకులు రంగంలోకి దిగారు. ప్రధానంగా ఆర్టీసీ డిపోను లక్ష్యంగా చేసుకున్నారు. బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డిపో ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. దీంతో బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీసీల రిజర్వేషన్ల డిమాండ్‌ను తక్షణమే నెరవేర్చాలని నినదించారు. డిపో వద్ద నిరసన అనంతరం బీసీ నాయకులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. "బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి", "సామాజిక న్యాయం సాధించే వరకు పోరాటం ఆగదు" అంటూ నినాదాలతో పట్టణ వీధుల్లో హోరెత్తించారు.

బీసీ సంఘాల పిలుపునకు మద్దతుగా పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలన్నీ మూసివేసి బంద్‌లో పాలుపంచుకున్నాయి. బీసీ నాయకుల నిరసన, బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిపో వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టడంతో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు. బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని లేనిపక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ​మొత్తం మీద, బీసీ రిజర్వేషన్ల కోసం హుజూరాబాద్ పట్టణంలో జరిగిన ఈ బంద్ విజయవంతమైంది. బీసీల ఐక్యత, పట్టుదల ఈ నిరసనలో స్పష్టంగా కనిపించింది.

Read More..

కొనసాగుతోన్న బీసీ సంఘాల బంద్.. జిల్లాల్లో డిపోలకే పరిమితమైన బస్సులు

Next Story