హస్తం వైపు చూస్తున్న బీజేపీ , బీఆర్ఎస్ అసంతృప్తులు

by Disha Web Desk 6 |
హస్తం వైపు చూస్తున్న బీజేపీ , బీఆర్ఎస్ అసంతృప్తులు
X

దిశ,చండూరు: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇక్కడి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపుతుంది. ఇప్పటివరకు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణా రెడ్డి వర్గాలుగా విడిపోయారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నాయకుల, కార్యకర్తల వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయని తెలుస్తుంది. రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా నిర్వహించారు. కలిసి పనిచేయడానికి రెండు వర్గాల కార్యకర్తలు ,నాయకులు సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీ లో చేరగా, మరికొంత మంది బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఆయా పార్టీలలో చేరినప్పటి నుంచి పాత, కొత్త నాయకులు కలిసి పని చేయలేక పోయారు.

అప్పటినుండి ఇప్పటివరకు నాయకుల మధ్య సయోధ్య లేదు. దీనికి తోడు బీజేపీలో నాయకుల మధ్య పదవుల పంచాయతీ నడుస్తుంది. బీజేపీలో సరైన గుర్తింపు లేదని భావిస్తున్న నాయకులు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే చండూర్ మాజీ సర్పంచ్ కోడి గిరి బాబు కూడా తన రాజకీయ భవిష్యత్ కు హామీ లభించిన తర్వాతే కాంగ్రెస్ లో చేరారనే చర్చ నడుస్తోంది. బీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ పార్టీ అధికారంలో ఉండటంతో కొంత కాలం వేచి చూసే ధోరణిలో ఉంటున్నట్లు పలువురు తెలిపారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులు,కార్యకర్తలు రాబోయే రోజులలో కాం గ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఇదే జరిగితే నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమేమీ కాదని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు గ్రూప్ తగాదాలకు పో కుండా కలిసి కట్టుగా పనిచేయాలని, భవిష్యత్తులో ఎవరికి టికెట్ వచ్చిన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు అంటున్నారు. కానీ కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న వారిని కాదని,ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేవారికి ప్రాధాన్యత ఇచ్చి పదవులను కట్టబెట్టితే కార్యకర్తలలో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉందని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ ఐక్యతతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురేస్తామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more:

ట్విన్ టవర్స్‌పై కేసీఆర్ ఫోకస్.. ఎన్నికల్లోపే శంకుస్థాపన చేసేలా స్కెచ్



Next Story

Most Viewed