ట్విన్ టవర్స్‌పై కేసీఆర్ ఫోకస్.. ఎన్నికల్లోపే శంకుస్థాపన చేసేలా స్కెచ్

by Disha Web Desk 4 |
ట్విన్ టవర్స్‌పై కేసీఆర్ ఫోకస్.. ఎన్నికల్లోపే శంకుస్థాపన చేసేలా స్కెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సిటీలో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై తనదైన ముద్ర కోసం సీఎం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సెక్రటేరియట్, పోలీస్ టవర్స్ నిర్మించిన కేసీఆర్, ఇప్పుడు హెచ్ఓడీల కోసం ట్విన్ టవర్స్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. సెక్రటేరియట్‌కు సమీపంలో ట్విన్ టవర్స్ నిర్మాణం ఉండాలని మూడు రోజుల క్రితం అధికారులకు సూచించారు. ఈ బాధ్యతలను చీఫ్ అడ్వయిజర్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో అధికారుల బృందం సెక్రటేరియట్‌కు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించి, సీఎం‌కు రిపోర్టు అందజేసినట్లు తెలిసింది.

పాటిగడ్డ ఫస్ట్ ప్రయారిటీ

ట్విన్ టవర్స్ నిర్మాణం కోసం పాటిగడ్డ, రెడ్‌ హిల్స్, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను అధికారులు పరిశీలించారు. పాటిగడ్డలో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. అక్కడ టవర్స్ నిర్మించి, సెక్రటేరియట్‌కు వచ్చేందుకు వీలుగా పాటిగడ్డ నుంచి సంజీవయ్య పార్కు ప్రాంతం వరకు 600 మీటర్ల పొడవుతో రైల్వే ట్రాక్ పై నుంచి బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ బ్రిడ్జి నిర్మిస్తే బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని సూచించినట్లు సమాచారం.

ఒకవేళ పాటిగడ్డ స్థలం వద్దనుకుంటే, సెక్రటేరియట్ సమీపంలోని ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్ లో నిర్మించవచ్చని సజెస్ట్ చేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి సెక్రటేరియట్‌కు వచ్చేందుకు స్కై వేను నిర్మించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తిగా పాతపడినవి, పక్కనే ఉన్న రిడ్జ్ హోటల్ స్థలం, ఆ వెనుక ఉన్న లోకాయుక్త బిల్డింగ్ స్థలాన్ని సేకరిస్తే, ట్విన్ టవర్స్‌కు కావాల్సినంత స్థలం అందుబాటులోకి వస్తుందని వివరించినట్లు తెలిసింది. చివరిగా రెడ్ హిల్స్ ప్రాంతంలోని స్థలాన్ని సజెస్ట్ చేసినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

శ్రావణంలో భూమి పూజ?

సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే భూమి పూజ చేసేందుకు అధికారులు రెడీగా ఉన్నారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఉన్నాయి. ఆ వేడుకలు పూర్తవగానే కేసీఆర్ ట్విన్ టవర్స్‌పై ఫోకస్ పెట్టే చాన్స్ ఉంది. స్థలం ఎంపిక ఫైనల్ అయిన తర్వాత ఆయన స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించి, టవర్స్ నిర్మాణంపై సలహాలు, సూచనలు చేస్తారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే శ్రావణ మాసంలో ట్విన్ టవర్స్ కు కేసీఆర్ భూమి పూజ చేసే అవకాశం ఉందని ఆఫీసర్లు భావిస్తున్నారు.

Read More: వచ్చే ఎన్నికల్లో మంత్రి తలసాని గెలుపు కష్టమే!

గన్‌పార్క్ వద్ద 10 ప్రశ్నలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన వైఎస్ షర్మిల

Next Story

Most Viewed