బూర్గంపాడు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఉద్రిక్త‌త

by Ratna Kumari |   (  Updated:2025-12-11 04:37:33  IST  )

దిశ-​బూర్గంపాడు : పంచాయ‌తీ తొలి విడుత ఎన్నికల సందర్భంగా బూర్గంపాడు మండలంలో అధికారులు, స్థానిక రిపోర్టర్ల మధ్య తీవ్ర

బూర్గంపాడు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఉద్రిక్త‌త
X

దిశ-​బూర్గంపాడు : పంచాయ‌తీ తొలి విడుత ఎన్నికల సందర్భంగా బూర్గంపాడు మండలంలో అధికారులు, స్థానిక రిపోర్టర్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు, పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని, సమాచారం ఇవ్వకుండా అడ్డుకున్నారని స్థానిక విలేకరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​సారపాక మసీదు రోడ్డులోని హైస్కూల్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ అందరితో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నారని రిపోర్టర్లు, స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతతకు భంగం కలిగించేలా సదరు కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి, ఆ కానిస్టేబుల్‌ను డ్యూటీ నుంచి తొలగించి వేరే ప్రాంతానికి మార్చాలని రిపోర్టర్లు డిమాండ్ చేస్తున్నారు.​

స్థానిక ఎన్నికల అధికారి ఉద్దేశపూర్వకంగా రిపోర్టర్లను అవమానించే పరిస్థితి సృష్టించారని విలేకరులు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల సమాచారం పై అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, రిపోర్టర్లను గందరగోళానికి గురిచేస్తున్న అధికారి ఎవరు? అంటూ విలేకరులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని పలు కేంద్రాల వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు. పోలీసు సీఐ కూడా పోలింగ్ కేంద్రం లోనికి రిపోర్టర్లను అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని వాపోయారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పోలీసులు, స్థానిక రిపోర్టర్ల మధ్య ముందుగా ఒక అవగాహన సమావేశం ఏర్పాటు చేసి ఉంటే ఈ అనవసర గందరగోళం ఉండేది కాదని రిపోర్టర్లు అభిప్రాయపడ్డారు. పారదర్శకత కోసం పనిచేసే మీడియా ప్రతినిధులను పోలింగ్ కేంద్రాల లోనికి అనుమతించకుండా అడ్డుకోవడం, అవమానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని రిపోర్టర్లు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని,రిపోర్టర్లకు సహకారం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read More..

అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన ఎన్నికల పంచాయితీ దావత్

Next Story