భద్రాద్రి కొత్తగూడెంలో అవినీతి గని..మాట వినకుంటే అంతే సంగతులు!

by Disha Web Desk 16 |
భద్రాద్రి కొత్తగూడెంలో అవినీతి గని..మాట వినకుంటే అంతే సంగతులు!
X
  • మైనింగ్ అధికారి అంతులేని అక్రమాలు
  • నిత్యం లక్షల్లో వసూళ్లు
  • డ్రైవర్ కం అటెండర్‌తో రాయబారాలు
  • క్షణాల్లో సెటిల్మెంట్లు

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ప్రతినెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకపోగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు కాస్త వసూళ్ల పర్వానికి తెరలెప్పుతున్నారు. ఉన్నతాధికారి హోదాలో ఉంటూ కింది స్థాయి సిబ్బందిని మధ్యవర్తులుగా మారుస్తూ తాము చేస్తున్న వసూళ్లకు ఆనవాళ్లు లేకుండా పాదరసంలా జారిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్ డిపార్టుమెంటులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తనకు ప్రభుత్వం ఇస్తున్న జీతం సరిపోవడం లేదు అనుకున్నాడో ఏమో కానీ వసూళ్ల పర్వానికి తెరలేపాడు.

నిత్యం లక్షల్లో వసూళ్లు..

ఈ మైనింగ్ అధికారి ఒక్కసారి తన ఆఫీసు గేటు దాటి ఫీల్డ్ మీదకు వెళితే అక్రమార్కులకు వెన్నులో వణుకు పుట్టాల్సిందేనట. క్వారీలు, ఇటుక బట్టీలు, అనుమతికి మించి తరలిస్తున్నా ఇసుక లారీల వరకు సారుకు ముడుపులు ముట్టజెబితే తప్ప పనులు ముందుకు సాగవని తెలుస్తున్నది. జిల్లాలో అక్రమ మైనింగ్ ఏ మారుమూల జరిగినా ఈ అవినీతి అధికారికి తాను అడిగినంత ముడుపులు ముట్టజెపితే తప్ప పనులు సాఫీగా సాగవని జిల్లా వ్యాప్తంగా చర్చ లేకపోలేదు. ఒక్కసారి ఈసారుకు చిక్కితే అంతే సంగతులు తాను అడిగినంత డబ్బులు ముట్టజెపితే తప్ప వారి పనులు సాఫీగా తాగే పరిస్థితి కనబడటం లేదని అనేక మంది బాధితులు వాపోతున్నారు. సదరు మైనింగ్ అధికారి ప్రతి పనికి ఒక రేట్ ఉంటుందట. బేరమాడినా బ్రతిమలాడినా సారు క్రోపోద్రేతులై శపించినంత పని చేస్తారట.

డ్రైవర్ కం అటెండర్‌తో రాయబారాలు, క్షణంలో సెటిల్మెంట్లు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ మైనింగ్ జరిగినా, ఇటుక బట్టిల నుంచి ఇసుక వరకు ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా వసూళ్ల పర్వానికి ఈ మైనింగ్ అధికారి తెర తీశారు. తన వద్ద పనిచేస్తున్న కింది స్థాయి డ్రైవర్ కం అటెండర్‌ను రాయబారిగా వాడుకుంటూ లక్షల్లో అవినీతి సంపాదనను మూటగట్టుకుంటున్నాడు. ఈమైనింగ్ అధికారి కన్ను పడిందంటే మొదట తనకు సన్నిహితంగా ఉన్న ఉద్యోగిని రాయబారానికి పంపిస్తాడు. రాయబారానికి వెళ్లిన సదరు కిందిస్థాయి ఉద్యోగి ‘సారు మీ మీద కోపంగా ఉన్నారు అర్జంటుగా వెళ్లి కలవండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు’ అంటూ ఒక కబురు పంపించి, తన మనసులో ఉన్న మాటను తన డ్రైవర్‌తో అవతలి వారికి చేరవేసి లక్షల్లో లంచాలు పుచ్చుకుంటాడు.

ఒకవేళ మాట వినకుంటే నిబంధనల ప్రకారమే డ్యూటీ చేస్తానంటూ పట్టపగలే నక్షత్రాలు చూపుతాడని జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇతగాడు ఏ ఒక్క రూపాయి లంచం తీసుకోవాలన్న తన స్వహస్తాలతో తీసుకోకుండా కింది స్థాయి సిబ్బందిని పావులా వాడుతూ వచ్చిన లంచపు సొమ్ములో కాస్త కూసో కింది స్థాయి సిబ్బందికి ముట్టజెప్పి వ్యవహారం బయటికి పోకుండా నోరు మూయిస్తారు. ఉన్నతస్థాయి మైనింగ్ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన విధులను మరచి లంచగొండి అవతారం ఎత్తిన ఈ మైనింగ్ ఉన్నతాధికారిపై సరైన విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని కొంతమంది బాధితులు కోరుతున్నారు.

Read more:

విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు.. జోరుగా సాగుతున్న సెటిల్మెంట్ల పర్వం



Next Story

Most Viewed