విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు.. జోరుగా సాగుతున్న సెటిల్మెంట్ల పర్వం

by Disha Web Desk 6 |
విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు.. జోరుగా సాగుతున్న సెటిల్మెంట్ల పర్వం
X

దిశ, మునుగోడు; ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేస్తున్నా.. ప్రభుత్వ భూమి, శిఖం భూములను సైతం ఆక్రమించి నిర్మాణాన్ని చేస్తున్న అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. రహదారి ఆనుకొని ఉండటంతో సెంటు భూమి లక్షల్లో పలుకుతుందని అక్రమార్కులు ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకొని కట్టడాలు చేస్తున్నారు. విలువైన భూమి స్థలాల్లో పుట్టగొడుగుల అక్రమ నిర్మాణాలు నిలుస్తున్న సంబంధిత అధికారులు మాత్రం ఆ దిశగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మునుగోడు గ్రామ శివారులోని మునుగోడు- చండూరు రహదారి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 78 లో గల ప్రభుత్వ భూమిని కస్తూర్భా పాఠశాల కోసం అప్పటి తహశీల్ధార్ కేటాయించారు. అదే తరహాలో మా భూమిని ప్రభుత్వం తీసుకుంటుందోమో అనే అనుమానంతో అక్కడి రైతులు అడ్డికిపావుశేరుకు ఫంక్షన్ హాల్ నిర్వాహకుడికి విక్రయించారు. అట్టి 78 సర్వే నెంబర్ లో పశువుల కొట్టం నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని ఫంక్షన్ హాల్ నిర్మాణం రెండు, మూడు నెలలుగా చేపడుతున్న అధికారులు మాత్రం ప్రశ్నించడం లేదు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అడ్డు రావద్దని, నీకు ఎంత కావాలో తీసుకో అని అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరితో రెండు నెలలుగా సెటిల్మెంట్ల పర్వం జోరుగా కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

నాకు నష్టం జరిగితే ఏ అధికారికి, ఏ నాయకునికి ఎంత ఇచ్చానో వారి పేర్లు బయట పెడతానని ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు బహిరంగంగానే వెల్లడిస్తున్నట్లు సమాచారం. ఎన్ని లక్షలైనా ఖర్చు చేసి చేస్తానని నిర్మాణం పనులు ఆపే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రహదారికు ఆనుకొని ఉండడంతో భూమి విలువ కోట్లలలో పలుకుతుంది. సుమారు ఒక ఎకరం వరకు ప్రభుత్వ భూమి విస్తీర్ణంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని కూల్చివేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

నామమాత్రమే నోటీసులు.. పనులు మాత్రం అగడంలేదు

ఎలాంటి అనుమలు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్న వచ్చిన సమాచారం మేరకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయిన ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులు అగడంలేదు. నిర్వహకుడు అందరిని మేనేజ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న ఆరోపణల మేరకు కొద్ది రోజులు పనులు అపమని అధికారులు ఫంక్షన్ హాల్ నిర్వహకుడిని బుజ్జగించినట్లు సమాచారం. త్వరగా పనులు పూర్తి చేస్తే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో లో పట్టా చేసుకోవచ్చునని అందుకు అధికారులు సహకరించాలని సదరు ఫంక్షన్ హాల్ నిర్వహకుడు పైరవీలు జరుపుతున్నట్లు సమాచారం.

అసైన్డ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు; మునుగోడు తహశీల్ధార్ వై.క్రిష్ణారెడ్డి

వ్యవసాయ భూములు వ్యవసాయేతర పనులకు వినియోగించి, అసైన్డ్ నింబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని మునుగోడు తహశీల్దార్ కృష్ణారెడ్డి తెలిపారు. 78 సర్వే నెంబర్లు అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు తమకు సమాచారం రావడంతో పనులు నిలిపివేశామని త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించి అట్టి భూమిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు.


Next Story