మండలిలో నేరుగా రాజీనామా పత్రాన్ని అందజేసిన కవిత

by Malleboina Mahesh |   (  Updated:2026-01-05 09:34:19  IST  )

తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఆమె జాతీయా మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.

మండలిలో నేరుగా రాజీనామా పత్రాన్ని అందజేసిన కవిత
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఆమె జాతీయా మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. తాను త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె తన శాసనమండలి (MLC) సభ్యత్వానికి మరోసారి రాజీనామా చేసినట్లు తెలిపారు. తానే నేరుగా మండలిలో తన రాజీనామా పత్రాన్ని సమర్పించానని, చైర్మన్ దీనిని ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె మీడియాతో చెప్పుకొచ్చారు.

అలాగే బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన తీరు అత్యంత అవమానకరంగా ఉందని, ఆ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, దీనిపై మాట్లాడటానికి తనకు మాటలు కూడా రావడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిని అవలంబిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి ప్రస్తుతం ఒక స్వతంత్ర రాజకీయ శక్తి అవసరం ఉందని, అందుకే ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు అతి త్వరలోనే కొత్త పార్టీని స్థాపిస్తామని కల్వకుంట్ల కవిత జాతీయ మీడియాకు స్పష్టంగా చెప్పుకొచ్చారు. దీంతో గత కొంత కాలంగా కవిత సొంత పార్టీ పెట్టబొతుందని వస్తున్న వార్తలు నిజమయ్యాయి.

Read More : అన్న ఇలాకాకు చెల్లి

Next Story