ఆసక్తికరంగా సీఎం కేసీఆర్ పర్యటన

by Dishanational1 |
ఆసక్తికరంగా సీఎం కేసీఆర్ పర్యటన
X

దిశ, కరీంనగర్ బ్యూరో: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి సీఎం కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటన ఆధ్యాతం ఆసక్తికరంగా సాగింది. వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని కరీంనగర్​జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్​కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రులు,​ బీఆర్ఎస్​నాయకులు ఘన స్వాగతం పలికారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్​లో పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదికలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఆకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, అధైర్య పడొద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రైతులకు భరోసా కల్పించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌కు కేసీఆర్​వరంగల్​ పర్యటన ముగించుకొని హెలికాప్టర్ ద్వారా చేరుకోగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం లక్ష్మీపూర్​గ్రామంలో ఆకాల వర్షాలతో దెబ్బతిన్న మస్క్ మిలన్, డ్రాగన్ ఫ్రూట్ పంటలను నష్టపోయిన ముస్కు రామచంద్రారెడ్డిని, బండ శంకరయ్య వరి పొలం, పంట పొలాలను పరిశీలించి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో 2,25,258 ఎకరాల్లో మొక్కజొన్న, మామిడి, వాటర్ మిలన్ తదితర పంటలకు నష్టం జరిగిందన్నారు. పంటను నష్టపోయిన రైతులకు దేశ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రతి ఎకరానికి రూ.10వేల ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీఓ కాపీని సైతం విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా కౌలు రైతులపై తొలిసారిగా ప్రేమ కురిపించారు. ఆకాల వర్షాలతో పంటలు నష్టపోయిన కౌలు రైతులకు సైతం పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

భారీ బందోబస్తు..

ముఖ్యమంత్రి కేసీఆర్​పర్యటన సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రామడుగు మండలానికి వచ్చే పలు రహదారులను మూసి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దకు స్థానిక ప్రజాప్రతినిధులను అనుమతించకపోవడంతో వివాదం ఏర్పాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు మహిళ రిజర్వేషన్ అంటూ పోరాటం చేస్తుంటే ఒక మహిళ ఎంపీపీనైనా తనను ముఖ్యమంత్రి పర్యటనకు రాకుండా అడ్డుకున్నారని రామడుగు ఎంపీపీ కవిత ఆరోపించారు. ముందుగా హెలిప్యాడ్​వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని మీడియా సమావేశం వద్ద కనీసం ముఖ్యమంత్రిని కలిసి నమస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల బిల్లు కోసం అంటూ పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఒక మహిళ ఎంపీపీని అవమానించడం చాలా బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు మండలానికి చెందిన సర్పంచ్‌ను పోలీసులు అడ్డుకుని ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉంచారని ఆరోపించారు.

రైతులతో మాట్లాడకుండానే...

ముఖ్యమంత్రి కేసీఆర్​పర్యటనలో భాగంగా అధికారులు తికమక చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం రామడుగు మండలంలో పంటలు దెబ్బతిన్న 10 మంది రైతులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతారని నిర్ణయించారు. వ్యవసాయాధికారులు 10మంది రైతులను గుర్తించి ముఖ్యమంత్రితో వారిని మాట్లాడించడానికి ఏర్పాట్లు చేశారు. రామడుగు రైతు వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడానికి ముందు రైతులతో మాట్లాడించాలని 10 మంది రైతులను రైతు వేదిక లోపలికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రైతు వేదిక వద్దకు వచ్చే సమయంలో రైతులను అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రైతు వేదిక వద్దకు చేరుకుని రైతులు ఎక్కడ అని ప్రశ్నించే సరికి అక్కడ రైతులు లేరని సమాధానం వచ్చింది. వారిని తిరిగి లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి మీడియా సమావేశం ప్రారంభించారు. మీడియా సమావేశం తరువాత రైతులతో మాట్లాడుతారని భావిస్తే మీడియా సమావేశం తరువాత నేరుగా హెలిప్యాడ్​వద్దకు ముఖ్యమంత్రి వెళ్లిపోయారు.

కాంగ్రెస్​ నాయకులు అరెస్ట్

ముఖ్యమంత్రి కేసీఆర్​కరీంనగర్ జిల్లా పర్యటనతోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​పేఫర్ లీకేజీ వ్యవహారంలో సిట్​ఇచ్చిన నోటిసుతో సిట్​కార్యాలయానికి వెళ్లుతున్న కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పీసీసీ చీఫ్ పిలుపు ఇవ్వడంతో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పోలీసులు కాంగ్రెస్​నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావును ఎలిగేడు మండలంలోని శివపల్లిలో హౌజ్ అరెస్ట్ చేశారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్​పార్టీ నాయకులు పోలీసుల అదుపులోనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి: సీఎం ప్రక‌ట‌నతో పంట న‌ష్టంపై స‌ర్వే షురూ

Next Story