కాళేశ్వరం లెక్కలు వెలికితీస్తాం.. : CM రేవంత్ రెడ్డి వార్నింగ్

by Disha Web Desk 4 |
కాళేశ్వరం లెక్కలు వెలికితీస్తాం.. : CM రేవంత్ రెడ్డి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రవేశ పెట్టి శ్వేత పత్రంపై బుధవారం చర్చ వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హరీశ్‌రావు ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ సభ్యుడని.. ఫస్ట్ టర్ములో హరీశ్‌రావు సాగునీటి మంత్రిగా పని చేశారన్నారు. తొమ్మిదిన్నరేళ్ళుగా సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నదన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు లెక్కలపై సంపూర్ణ సమాచారం ఉంటుంది. అంచనాలు రూ.80 వేల కోట్లు అయితే లక్ష కోట్లు అవినీతి జరిగింది ఎలా అయిందని హరీశ్ రావు ప్రశ్నిస్తున్నారు.

ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు 97,449 కోట్లు మంజూరైతే అందులో రుణంగా రూ. 79,287 కోట్లు విడుదలైందన్నారు. ఇంకా చెల్లించాల్సింది రూ. 74,590 కోట్లు అన్నారు. ఈ అప్పులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను బడ్జెట్ నుంచి కేటాయించింది. ఆ లెక్కలను శ్వేతపత్రంలో పేర్కొనలేదు. వాటిని కూడా త్వరలో సభకు ఇస్తామన్నారు. అంతా కలిపి లక్ష కోట్లు దాటిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు, ఎన్ని రుణాలు తీసుకొచ్చారనే వివరాలను వెలికితీస్తామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అంచనాలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను అడుగుతాను. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి చేసిన ఖర్చును కూడా వెల్లడిస్తాం. అంచనా వ్యయం రూ. 80 వేల కోట్లు కాదు. అప్పులే రూ. 97,449 కోట్లు తీసుకుంటే దాని వ్యయం అంచనా ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీరు రైతులకు, పరిశ్రమలకు అందుతాయి.. ఒక ఏటా రూ. 5,199 కోట్లు ఆదాయం వస్తుందని నివేదికలో పేర్కొన్నది. వీటికి నీళ్ళు అమ్ముతామని చెప్పింది. మొత్తం వ్యాపారం చేస్తాం అని చెప్పింది. దీన్ని చెప్పే అప్పులు చేసింది కార్పొరేషన్.

మిషన్ భగీరథ : ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం 2014కు ముందు గ్రామాల్లో నీళ్ళు తాగలేదన్నట్లు చెప్తున్నది. శివుడి తలమీద గంగను భూమి మీదకు తెచ్చి కాళేశ్వరం ద్వారా పంపిణీ చేసి అద్భుతం చేసి జీవితాలను ధన్యం చేసినట్లు, రోల్ మోడల్ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నది. సభను మిస్ లీడ్ చేసేలా హరీశ్‌రావు వ్యవహరిస్తున్నారు. భగీరథ ద్వారా 2019-20లో గ్రామ పంచాయతీల నుంచి రూ. 1,030 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా రూ. 159 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ. 369 కోట్లు, పరిశ్రమల నుంచి రూ. 4,145 కోట్లు మొత్తం రూ. 5,706 కోట్లు ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి అప్పులు తీసుకునేటప్పుడు బ్యాంకుల్ని మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి రుణం తీసుకున్నది. నిజంగానే ప్రజల నుంచి వసూలు చేసి సాగు, త్రాగునీటిని వ్యాపారంగా మార్చి ప్రజల సెంటిమెంటును వాడుకున్నదా?

మొత్తం రూ. 10,905 కోట్లను ప్రజలను ముక్కు పిండి వసూలు చేస్తామని అడ్డగోలుగా అప్పులు తెచ్చింది. ఈ అప్పులకు సంతకాలు చేసిందెవరు? 2015-16 కాగ్ నివేదికలో.. ఆఫ్ బడ్జెట్ అప్పులను ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను, ప్రభుత్వాన్ని తప్పుపట్టించినట్లు ఉన్నది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొచ్చి అప్పుల కుప్పగా మార్చిందని పేర్కొన్నది. 2018-19లో బడ్జెట్ తయారీలోనే లోపభూయిష్టంగా ఉన్నదని, విదానాన్ని మార్చుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అక్షింతలు వేసింది. ఇవన్నీ వాస్తవాలు. అబద్ధాలతో సభను, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం హరీశ్‌రావు చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రవేశపెడితే శాసన వ్యవహారాల మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.

Read More : అసెంబ్లీలో హరీష్ రావు Vs మంత్రి కొండా సురేఖ



Next Story