బట్టి నివాసంలో టీ కాంగ్రెస్ అసంతృప్త నేతల కీలక భేటీ

by Disha Web Desk 12 |
బట్టి నివాసంలో టీ కాంగ్రెస్ అసంతృప్త నేతల కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల చిచ్చు ఆరడం లేదు. పీసీసీ కమిటీల నియామకం విషయంలో ఇప్పటికే బహిరంగంగా గళం విప్పుతున్న అసమ్మతి నేతలు తాజాగా శనివారం సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా, ఉత్తమ్, జీవన్ రెడ్డి, గీతారెడ్డి తో పాటు మరికొంత మంది హాజరైనట్టు తెలుస్తోంది.ఈ మీటింగ్ ను ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోఆర్డినేట్ చేసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ కమిటీల కూర్పు పై పలువురు సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కాదని జూనియర్లకు పార్టీ పదవులు కట్టబెట్టారని, అసలు గాంధీ భవన్ మెట్లు తొక్కని వారికి అందలం ఎక్కించడం ఏంటని అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ కమిటీల కూర్పుపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజా భేటీ తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తిగా మారింది. కమిటీల కూర్పు విషయంలో ఏఐసీసీకి లేఖ రాయాలా? లేక నేరుగా మల్లికార్జున ఖర్గేను కలిసి పరిస్థితిని వివరించాలా? అనే విషయంపై నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అసంతృప్త నేతలంతా టీపీసీసీ రేవంత్ రెడ్డి వైపు వేలు చూపించడం చర్చగా మారుతోంది. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అసలే నానాటికీ పార్టీ పరిస్థితి దిగజారిపోతుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీలోని సీనియర్ల అసంతృప్తి ఎటువైపు దారితీస్తుందో అనే చర్చ ఆసక్తిగా మారింది.

Revanth Reddy ఉక్కిరిబిక్కిరి.. హై కమాండ్‌‌కు తరచూ కంప్లైంట్స్!


Next Story